|
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రిష, కార్తీక హీరో హీరోయిన్లుగా నటించిన 'దమ్ము' సినిమా ఆడియో ఘనంగా విడుదలైంది. సినీప్రముఖులు, నందమూరి అభిమానుల సమక్షంలో పాటలు ఆవిష్కరించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు తననయుడు అలగ్జాండర్ వల్లభ ఈ సినిమాని నిర్మించారు. కీరవాణి దంపతులు ఆడియో సీడీని ఆవిష్కరించి ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీప్రణతికి ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ నా గుండెల్లో నిలిచి ఉన్న మన దైవం ఎన్టీఆర్కి పాదాభివందనం చేస్తున్నాను. అభిమానుల రుణం వంద జన్మలెత్తినా తీర్చుకోలేను. వారిని, నా కన్న తల్లిదండ్రులను ఎప్పటికీ మర్చిపోలేను అని ఉద్వేగంగా అన్నారు. బోయపాటి మొదట్లో 'భద్ర' కథతో నా దగ్గరకు వచ్చాడు. ఆ కథ నాకప్పుడు అంత నచ్చలేదు. కానీ సినిమా చూశాక 'భద్ర' లాంటి సినిమాని ఎందుకు వదులుకున్నానా? అని పశ్చాత్తాపపడ్డాను. కేయస్ రామారావుగారు పదేళ్ల క్రితం నాకో మాట చెప్పారు. హీరోల చుట్టూ తిరగడం నాకలవాటు లేదు. ఏదైనా ఒక హీరోనే నమ్ముకుంటాను. నేను మళ్లీ తీస్తే మీతోనే సినిమా చేస్తాను అని.
ఈ పదేళ్లల్లో బోయపాటి గురించే ఎక్కువగా చెప్పేవారు. 'సింహా' సినిమా చూసి షాక్ అయ్యాను. ఇలా కూడా సినిమా తీయొచ్చా అనుకున్నాను. అదేరోజు కేయస్ రామారావుగారికి ఫోన్ చేసి, మన డెరైక్టర్ బోయపాటి శ్రీను అన్నాను. 'దమ్ము' కి ముందు తను నాకు తొమ్మిది కథలు వినిపించాడు. 'సింహా' లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడి దగ్గర తొమ్మిది కథలను ఒక హీరో రిజెక్ట్ చేస్తే.. ఆ డెరైక్టర్ ఎలా ఫీలవుతాడో అనిపించింది. కానీ ఫీలవ్వలేదు. 'దమ్ము' లాంటి దమ్మున్న కథ చెప్పాడు. ఇళయరాజా తర్వాత నాకిష్టమైన సంగీత దర్శకుడు కీరవాణిగారు. ఆయన స్వరపరచిన రాలిపోయే పువ్వా... పాట విననిదే నిద్రపోను. పెళ్లయిన తర్వాత మా ఆవిడకి కూడా ఆ పాట వినడం అలవాటు చేశాను' అని చెప్పారు.
దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ -సింహా' తో వచ్చి తన దమ్మేంటో చూపించాడు బోయపాటి. ఈ పాటలు అందరికన్నా ముందు నేనే విన్నాను. 'రూలర్... పాట విన్నప్పుడు ఈ పాట నాకెందుకు రాలేదా? అనిపించింది. తారక్తో సినిమా చేసేటప్పుడు అది తనకెలా ఉపయోగపడుతుందా? అని ఎదురు చూస్తాను. అలా చేసినదే 'యమదొంగ' అన్నారు. ఎన్టీఆర్ ఎనర్జీని వాడుకుంటూ 'బాద్షా' చేస్తున్నాను. నాకు ఈ 'దమ్ము' పెద్ద టార్గెట్ అవ్వాలి. దాన్ని నా 'బాద్షా' క్రాస్ చెయ్యాలి అని చెప్పారు శ్రీను వైట్ల.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ -మాస్ని అలరించే విధంగా అద్భుతమైన పాటలు ఇచ్చారు కీరవాణిగారు అన్నారు. కీరవాణి మాట్లాడుతూ -ఎన్టీఆర్ ఈ సినిమాలో రూలర్గా కనిపించబోతున్నాడు. బోయపాటి మంచి క్రమశిక్షణ ఉన్న దర్శకుడు. 'దమ్ము' అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే మంచి సినిమా అని చెప్పారు. కొత్త పెళ్లికొడుకు ఎన్టీఆర్ని ఈ సినిమా కోసం 30 రోజులు పైగా ఎండలో కష్టపెట్టాం. ఈ సందర్భంగా ఆయన భార్య లక్ష్మీప్రణతికి సారీ చెబుతున్నాను. అలాగే నిర్మాణ సమయంలో ఎవరికైనా కష్టం కలిగించి ఉంటే సారీ అని కేయస్ రామారావు అన్నారు. ఈ వేడుకలో 'దమ్ము' యూనిట్ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
|