|
'కందిరీగ' కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా బెల్లంకొండ సురేశ్ మరో సినిమాను ప్రారంభించారు. వీరిద్దరి కాంబినేషన్ లో గత యేడాది వచ్చిన 'కందిరీగ' ఘన విజయం సాధించిన నేపథ్యంలో, ఆ చిత్ర దర్శకుడు సంతోష్ శీనివాస్ తోనే ఈ సినిమానూ బెల్లంకొండ నిర్మిస్తున్నారు.మల్టిడైమన్షన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ప్రెజెంటేషన్ లో ఈ సినిమా రూపొందుతోంది. 'కందిరీగ'కు సంగీతం అందించిన థమన్ ఈ చిత్రానికీ వర్క్ చేస్తున్నారు. అయితే హీరోయిన్ ఎంపిక మాత్రం ఇంకా జరగలేదు. గురువారం రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది.
'కందిరీగ' సినిమా చూసిన వాళ్ళందరూ అనకాపల్లి శ్రీనుగాడు పాత్రలో రామ్ ను తప్పితే మరొకరి ఊహించుకోలేరు. అదే తరహా క్యారెక్టరైజేషన్ తో 'కందిరీగ'కు సీక్వెల్ గా సంతోష్ శ్రీనివాస్ ఈ కథను తయారు చేశాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది కందిరీగకు సీక్వెల్ అని దర్శక నిర్మాతలు ఇంకా ధ్రువీకరించలేదు. దాదాపు అదే యూనిట్ ఈ కొత్త సినిమాకూ పని చేస్తుండటం విశేషం. మే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలువుతుంది. మరి ఈ కొత్త సినిమా 'కందిరీగ'ను మించి ఏ స్థాయిలో హిట్ అవుతుందో వేచి చూడాలి.
|