|
శ్రీరామరాజ్యం చిత్రంలో సీతగా నటించి మెప్పించిన నయనతారకు మంచి క్రేజ్ ఏర్పడింది. బాలకృష్ణ సరసన ఆమె అంతకు ముందు సింహ చిత్రంలో నటించింది కూడా. మరోసారి నయనతార, బాలకృష్ణ కాంబినేషన్ రిపీట్ అవబోతున్నట్లు సమాచారం.స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన అపురూప చిత్రరాజం 'నర్తనశాల'ను పునర్మించాలన్నది బాలకృష్ణ చిరకాల స్వప్నం. ద్రౌపది పాత్రలో సౌందర్యను కథానాయికగా ఎంచుకొని 2004లో స్వీయనిర్మాణ దర్శకత్వంలో బాలయ్య బాలకృష్ణ 'నర్తనశాల'ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
అయితే సౌందర్య అకాల మరణంతో ఆ ప్రాజెక్ట్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ సినిమాను తిరిగి ప్రారంభించే ఆలోచనలో బాలకృష్ణ వున్నట్లు సమాచారం. 'శ్రీరామరాజ్యం' చిత్రంలో మహాసాధ్వి సీత పాత్రలో నయనతార అద్భుతాభినయం బాలకృష్ణను ఎంతగానో ఆకట్టుకుందట. ద్రౌపది పాత్రకు నయనతార న్యాయం చేయగలదని బాలయ్య భావిస్తున్నారని, దీంతో ఆమె కథానాయికగా 'నర్తనశాల' తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలిసింది. 'శ్రీరామరాజ్యం' నిర్మాత యలమంచి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నటింపచేసేందుకు నయన్ ను బాలయ్య ఒప్పించినట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రం తెరమీదకు వెళితే మరో అద్భుత చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించే భాగ్యం కలుగుతుంది.
|