|
సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినిమాల ద్వారా నష్టపోయిన నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శన దారులను ఆదుకోవడంలో ముందుంటూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇప్పుడాయన కుమార్తె ఐశ్వర్య తండ్రికి తగ్గ తనయ అనిపించుకోవడానికి సిద్ధమైంది. '3' సినిమా ద్వారా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ఆమె సిద్ధమైంది.
సినిమాలు పరాజయం పాలై నిర్మాతలు, పంపిణీదారులు రోడ్డున పడ్డా, భారీ పారితోషికం తీసుకున్న హీరోలు మాత్రం చెక్కుచెదరకుండా ఉంటారు. అయితే సూపర్స్టార్ రజనీకాంత్ అందుకు మినహాయింపు. తన సినిమాలు పరాజయం పాలైనప్పుడు నిర్మాతను, పంపిణీదారుడిని పిలిచి మరి డబ్బులు వాసప్ ఇచ్చి ఆదుకున్న సహృదయుడు రజనీ. ఆమధ్య 'కుచేలన్' సినిమా విషయంలో ఆయన ఇలానే చేశారు. ఇప్పుడు తన కూతురు, అల్లుడు తీసిన 'త్రీ' సినిమా కారణంగా తన ఉదారతను మరోసారి చాటుకోబోతున్నారు.
భర్త ధనుష్ హీరోగా, స్వీయ దర్శకత్వంలో రజనీ కుమార్తె ఐశ్వర్య తీసిన 'త్రీ' సినిమా తమిళంలోనే కాదు తెలుగులోనూ ఘోర పరాజయం పాలైంది. తెలుగు హక్కులను భారీ మొత్తమిచ్చి తీసుకున్న నట్టికుమార్ కూడా కోట్లలో నష్టపోయాడు. 'ఈ సినిమా పరాజయం కంటే దీనిని ప్రమోట్ చేయడానికి ధనుష్, ఐశ్వర్య రాకపోవడం బాధ కలిగించింద'ని అప్పట్లో నట్టికుమార్ ఆరోపించారు కూడా.
అయితే ఈ సినిమా ద్వారా నష్టపోయిన వారి నష్టాన్ని పూడ్చే పనిలో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య పడింది. తండ్రి రజనీకాంత్ సలహా మేరకు, నష్టపోయినవారికి కొంత పరిహారం అందచేస్తానని ఆమె హామీ ఇచ్చినట్టు సమాచారం. తెలుగు డబ్బింగ్ హక్కులు పొందిన నట్టికుమార్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అదే నిజమైతే ఐశ్వర్య తండ్రికి తగ్గ తనయ అనిపించుకోవడం ఖాయం.
|