|
రాంచరణ్ హీరోగా నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా 'జంజీర్' వివాదం కోర్టుకెక్కక తప్పేట్లు లేదు. ఆ సినిమా నిర్మాత అమిత్ మెహ్రాకి దాని ఒరిజినల్ స్క్రిప్ట్ రచయితలు సలీం ఖాన్, జావెద్ అఖ్తర్ లీగల్ నోటీసులు పంపించారు. రీమేక్ కు సంబంధించి కాపీరైట్ ప్రకారం తమకు రాయల్టీ చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాపీరైట్ అమెండ్ మెంట్ బిల్ 2011ను సమీక్షించిన కమిటీలో సభ్యుడైన జావెద్ అఖ్తర్ ఆ హక్కు ప్రకారం తనకు రావాల్సిన రాయల్టీ కోసం పోరాడుతున్న తొలి వ్యక్తిగా నిలిచారు. కాపీరైట్ బిల్లు ప్రకారం సినిమాలకు సంబంధించి రచయితకు కూడా రాయల్టీ హక్కు ఉంటుంది. 'జంజీర్' సినిమా హక్కులు ఒరిజినల్ సినిమా నిర్మాతయిన ప్రకాశ్ మెహ్రా తనయుడు, ప్రస్తుత 'జంజీర్' రీమేక్ నిర్మాత అమిత్ మెహ్రా వద్ద ఉన్నప్పటికీ, రచయితకి తప్పకుండా రాయల్టీ చెల్లించాల్సిందే.
ఇప్పుడు దాని కోసమే జావెద్ అఖ్తర్ ఢిల్లీకి చెందిన ప్రసిద్ధ లీగల్ కంపెనీ లూథ్రా అండ్ లూథ్రాను సంప్రదించారు. ఆయన తరపున ఆ కంపెనీ అమిత్ కు లీగల్ నోటీస్ జారీ చేసింది. "చర్చించుకోవడానికి రమ్మని అమిత్ కు చెప్పాం. మమ్మల్ని మూడుసార్లు కలిసిన అమిత్ ఒక్కసారి కూడా రాయల్టీ గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు. కొద్ది రోజుల్లో ఈ విషయం గురించి మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి అన్ని వివరాలూ చెబుతాం" అని తెలిపారు జావెద్.
|