మంత్రి పదవికి కిడారి శ్రావణ్ రాజీనామా.. మే23న తేలనున్న భవితవ్యం!

  • IndiaGlitz, [Thursday,May 09 2019]

కిడారి శ్రావణ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం మంత్రి నారా లోకేశ్‌తో రాజీనామా విషయమై నిశితంగా చర్చించిన అనంతరం కిడారి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సచివాలయంలో సమర్పించారు. రాజీనామా లేఖను సచివాలయంలోని సీఎంవో అధికారులకు శ్రవణ్ అందజేశారు.

సీఎంవో ద్వారా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌కు ఈ రాజీనామా లేఖ వెళ్లనుంది. కాగా.. గతేడాది నవంబరు 11న చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కిడారి శ్రవణ్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాజ్యాంగ నియమావళి ప్రకారం చట్ట సభల్లో సభ్యుడిగా కాకుండా మంత్రిగా నియమితులైతే.. ఆరు నెలల్లోగా చట్ట సభకు ఎన్నిక కావాల్సి ఉంది. అయితే మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా శ్రావణ్ కాకపోవడంతో తప్పక రాజీనామా చేయాల్సి వచ్చింది.

రాజీనామా అనంతరం ఏమన్నారంటే...

టీడీపీ సొంత కుటుంబంలో వ్యక్తిలాగా నన్ను ఆదరించింది.

మంత్రిగా 6నెలల్లో ప్రజా సేవ చేసాను.

గిరిజన అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశాను.

నిబంధనల ప్రకారం రాజీనామా చెయ్యాల్సి వచ్చింది.

సీఎం చంద్రబాబు పార్టీ నేతలు రాజకీయాలకు కొత్తగా వచ్చిన ఆదరించారు.

నన్ను ఎంతగానో ప్రోత్సహించి సహకరించారు.

చట్టసభల్లో సభ్యుడిగా కాకపోయినా ప్రజా సేవచేసే అవకాశం వచ్చింది అని శ్రావణ్ మీడియాతో అన్నారు.

కాగా... కిడారి సర్వేశ్వరరావుతో పాటు మరో టీడీపీ నేత మావోయిస్టుల కాల్పుల్లో హతమైన విషయం విదితమే. అనంతరం కిడారి కుటుంబం నుంచి శ్రావణ్‌ను చంద్రబాబు తన కేబినెట్‌లోకి తీసుకున్నారు.

ఇదిలా ఉంటే 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన కిడారి సర్వేశ్వరరావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా ఈ ఎన్నికల్లో కిడారి శ్రావణ్ టీడీపీ అభ్యర్థిగా అరకు నుంచి పోటీ చేశారు. అయితే మే-23న వెలువడనున్న ఫలితాలతో శ్రావణ్ భవితవ్యం తేలనుంది.