కరోనా రోగుల కోసం అంబులెన్స్ డ్రైవర్‌‌గా మారిన కన్నడ హీరో

  • IndiaGlitz, [Saturday,May 01 2021]

ప్రముఖ నటుడు సోనూసూద్ బాటలోనే మరో హీరో కూడా కరోనా రోగులకు సేవలందిస్తున్నాడు. అయితే ఈ హీరో ఏకంగా కరోనా బాధితుల కోసం అంబులెన్స్ డ్రైవర్‌గా మారడం విశేషం. కరోనా సెకండ్ ఎంతటి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోందో తెలియనిది కాదు. కేసులే కాదు.. ఈసారి మరణాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండటం కలవరపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా రోగులున్నారంటేనే కనీసం ఆ ప్రాంతానికి వెళ్లడానికే జనం భయపడుతున్నారు. అలాంటి సమయంలో కరోనా రోగులకు సేవలందించేందుకు కన్నడ హీరో అర్జున్ గౌడ అంబులెన్స్ డ్రైవర్‌గా మారాడు.

ఒక్క సిగిరెట్ కారణంగా 18 మందికి కరోనా..

'యువరత్న', 'రుస్తుమ్' వంటి సినిమాలతో హీరోగా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న అర్జున్ గౌడ రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోను హీరో అనిపించుకుంటున్నాడు. ఆంబులెన్స్ డ్రైవర్‌గా మారి కరోనా బాధితులను ఆసుపత్రులకు తరలించడంతో పాటు.. ఈ మహమ్మారి కారణంగా మరణించిన వారి మృతిదేహాలను శ్మశానానికి తరలిస్తుండటం గొప్ప విశేషం. సెకండ్ వేవ్ తీవ్రతను తెలుసుకున్న అర్జున్ గౌడ 'ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్'.. పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ ద్వారానే కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను శ్మశానానికి తరలిస్తున్నారు.

ఇప్పుడున్న భయానిక పరిస్థితుల్లో కరోనా మృతదేహాల అంత్యక్రియలు ఎంత కష్టంగా మారాయనేది తెలియనిది కాదు. కరోనాతో చనిపోయారంటే సొంత వారు సైతం శవాన్ని ఆసుపత్రిలోనే వదిలేసి చేతులు దులిపేసుకుంటున్నారు. మరోవైపు అంత్యక్రియలు చేసేందుకు గానీ, మృతదేహాలను తీసుకెళ్లేందుకు గానీ అంబులెన్స్ డ్రైవర్లు కూడా ప్రస్తుత తరుణంలో ముందుకు రావడం లేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో సినీనటుడు అర్జున్ గౌడ ఇలాంటి సేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అర్జున గౌడ చేస్తున్న సాయం గురించి తెలుసుకున్న నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.