'కాంచన-3' హీరోయిన్‌కు లైంగిక వేధింపులు.. నటుడు అరెస్ట్

  • IndiaGlitz, [Thursday,April 25 2019]

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన హారర్ చిత్రం ‘కాంచన-3’. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో లారెన్స్ సరసన నటించిన రష్యన్ నటి రి డిజావి అలెగ్జాండ్రాకు లైంగిక వేధింపులు తప్పలేదు.! తనను రూపేశ్ కుమార్ అనే ప్రొఫెషనల్ పొటోగ్రాఫర్, నటుడు లైంగికంగా వేధించి.. బ్లాక్ మెయిల్‌‌ చేస్తున్నాడని అలెగ్జాండ్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు రూపేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అసలేం జరిగింది..!?

రష్యాకు చెందిన నటి రి డిజావి అలెగ్జాండ్రా తన భర్త, పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం చెన్నైకి వచ్చి, ఎంఆర్‌సీ నగర్‌‌లో నివాసముంటోంది. అటు వాణిజ్య ప్రకటనల్లో.. ఇటు సినిమాల్లో చేస్తూ ఈ ముద్దుగుమ్మ బిజీబిజీగా ఉంటోంది. ఇటీవల లారెన్స్ హీరోగా వచ్చిన ‘కాంచన-3’లో నటించి మెప్పించింది. అయితే గతంలో తనతో పాటు వ్యాపార ప్రకటనల్లో నటించిన రూపేష్ కుమార్ అనే వ్యక్తి అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి పలు భంగిమల్లో ఫొటోలు తీశాడని.. ఆపై ఆ ఫొటోలను తన వాట్సాప్‌కు పంపుతూ కోరిక తీర్చాలని బ్లాక్‌ మెయిల్ చేశాడు.

పాపం పండింది..!

అయితే అలెగ్జాండ్రా ఆ బ్లాక్‌మెయిలింగ్ లొంగకపోవడంతో.. తన కోరిక తీరిస్తే సరే లేకపోతే ఆ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించసాగాడు. దీంతో విసిగిపోయిన హీరోయిన్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ సీఐ దురై, దర్యాఫ్తు చేపట్టి, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మీడియాకు వివరించారు. కాగా రూపేష్ ఫోన్, ల్యాప్‌టాప్ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు అందులో ఇంకా ఎవరెవరి ఫొటోలు ఉన్నాయి..? రూపేష్ బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రూపేష్‌ను కఠినంగా శిక్షించాలని అలెగ్జాండ్రా డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై ఇంత వరకూ నడిఘర్ సంఘం స్పందించలేదు.