close
Choose your channels

Adipurush : దళితులకు నో ఎంట్రీ.. ఫేక్ పోస్టర్ వైరల్ , స్పందించిన ఆదిపురుష్ యూనిట్

Thursday, June 8, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తోన్న చిత్రం ఆదిపురుష్. భారతీయుల ఇతిహాస గ్రంథం రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా నిన్న తిరుపతిలోని తారక రామా మైదానంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రిలీజైన ఫైనల్ ట్రైలర్ ఆదిపురుష్‌పై అంచనాలను భారీగా పెంచేసింది.

తొలి నుంచి ఆదిపురుష్‌పై వివాదాలు :

అంతాబాగానే వుంది కానీ.. ఈ సినిమాను ఏ సమయంలో మొదలుపెట్టారో కానీ ఏదో ఒక వివాదం నెలకొంటూనే వుంది. టీజర్ రిలీజ్ అయ్యాక.. అందులోని పాత్రల తీరుతెన్నులు చూశాక అభిమానులు, సినీ విశ్లేషకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో నాలుక కరచుకున్న ఆదిపురుష్ యూనిట్ పాత్రల గెటప్ మార్చే యత్నాలు చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ నాటి నుంచి నేటి వరకు సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ ఆదిపురుష్ టీమ్.. గ్రాఫిక్స్ వర్క్‌ను మరోసారి చేయించి ట్రైలర్ నాటికి అన్ని జాగ్రత్తలు తీసుకుంది. వివాదం ముగిసి సినిమాకు పాజిటివ్ బజ్ వస్తున్న వేళ.. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారి ఆలయ ఆవరణలో కృతి సనన్, ఓంరౌత్‌లు కిస్సులు, హగ్గులు ఇచ్చుకోవడంతో మరో రచ్చ లేచింది.

దళితులకు ప్రవేశం లేదంటూ ఫేక్ పోస్టర్ :

ఇప్పటికే దీనిపై ట్రోలింగ్ జరుగుతూ వుండగానే ఆదిపురుష్‌పై మరో వివాదం ముసురుకుంది. ఆదిపురుష్ ప్రదర్శించబడే థియేటర్‌లలోకి దళితులకు ప్రవేశం లేదని ఓ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘ రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం, ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్‌ రాముడిగా నటించిన ఆదిపురుష్‌ సినిమా ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో ధర్మం కోసం నిర్మించిన ఈ సినిమాని హిందువులు అందరు తప్పకుండా వీక్షించాలి’’ అని ఈ పోస్ట్ లో రాసి ఉంది. దీంతో దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ సినిమాను అడ్డుకుంటామని.. ఈ చర్య దళిత హక్కులకు భంగం కలిగించడమేనంటూ దళిత నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటనపై విచారణ జరిపి తక్షణం చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరుతామని ప్రకటించారు.

ఆదిపురుష్ అందరిదీ అన్న మూవీ యూనిట్ :

వివాదం పెద్దదవుతున్న నేపథ్యంలో ఆదిపురుష్ టీమ్ స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని, ఇలాంటి వాటిని నమ్మొద్దని ప్రేక్షకులను చిత్ర యూనిట్ కోరింది. ‘‘ఆదిపురుష్‌’’ టీమ్‌ కుల, వర్ణ, మతం ఆధారంగా ఎలాంటి వివక్షను చూపకుండా సమానత్వం కోసం గట్టిగా నిలబడుతంది. ఈ చెడును ఎదురించే క్రమంలో మాకు మద్ధతుగా నిలవండి. ‘‘ఆదిపురుష్‌’’ ప్రతి భారతీయుడిది , చెడుపై మంచి గెలుస్తుందని’’ ప్రకటించింది మూవీ యూనిట్. అయితే ఆదిపురుష్‌కు వ్యతిరేకంగా ఈ దుష్ప్రచారం చేస్తోంది ఎవరు అన్నది మాత్రం తెలియాల్సి వుంది. పనిగట్టుకుని మరి ఈ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తోంది ఎవరో.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.