close
Choose your channels

మేజర్ ట్రైలర్ : చూస్తున్నంత సేపు ఉద్వేగం.. సెల్యూట్ కొట్టాల్సిందే

Monday, May 9, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

26/11 ముంబయి ఉగ్రవాద దాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా అడివి శేష్ హీరోగా ‘‘మేజర్’’ సినిమాను డైరెక్టర్‌ శశికిరణ్‌ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. సోనీ పిక్చర్స్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ మేజర్‌ను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో మేజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే మురళి శర్మ, ప్రకాశ్ రాజ్, రేవతి కీలకపాత్రలు పోషిస్తున్నారు.

తొలుత ఫిబ్రవరి 11న ‘‘ మేజర్ ’’ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని చిత్రబృందం గతంలో ప్రకటించింది. అయితే అప్పట్లో దేశంలో నెలకొన్న కోవిడ్ కారణంగా రిలీజ్‌పై చిత్ర యూనిట్ వెనక్కి తగ్గింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ వెయిటింగ్‌కు తెరదించుతూ జూన్ 3న ‘మేజర్’ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు సోమవారం ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

తెలుగులో ఈ ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు, హిందీలో సల్మాన్ ఖాన్, మళయాలంలో పృథ్వీరాజ్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే అడివి శేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడ్డట్టే కనిపిస్తోంది. ఆర్మీ గొప్పతనం, ముంబైలోని తాజ్ హోటల్‌పై ఉగ్రవాదుల దాడి, మారణహోమం, ముష్కరులను ఏరివేసేందుకు రంగంలోకి దిగిన సైన్యం, వారి మధ్య పోరాటం, బందీలుగా చిక్కిన వారి హావభావాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్.. ఆర్మీలోకి ఎలా ప్రవేశించారు. తల్లిదండ్రులతో ఆయన అనుబంధం తదితర అంశాలను కళ్లకు కట్టినట్లుగా తెలియజేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్ ఓ రేంజ్‌లో వున్నాయి. మరి తెరపై ‘‘మేజర్’’ విశ్వరూపం చూడాలంటే జూన్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.