ఆ టైమింగ్ క్యాచ్ చేయగలనో లేదో అని భయపడ్డాను - అడివి శేష్

  • IndiaGlitz, [Saturday,June 03 2017]

నటించిన అతికొద్ది చిత్రాలతోనే నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న నటుడు అడివి శేష్. త్వరలో అనంత్ గా "అమీ తుమీ"తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూన్ 9న విడుదలకానున్న "అమీ తుమీ" గురించి అడివి శేష్ చెప్పిన విశేషాలు..

అనంత్ ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను..

నా కెరీర్ లో నేను అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ లో నటించడం ఇదే మొదటిసారి. అసలు నేను కామెడీ చేయగలనా అనే అనుమానం నాకే ఉండేది. అయితే.. మోహనకృష్ణ ఇంద్రగంటిగారు "నువ్వు చేయగలవ్" అని చెప్పి నాతో అనంత్ పాత్ర చేయించారు. అవసరాల శ్రీనివాస్, తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్ లాంటి నటుల స్థాయిలో కామెడీ పండించగలనో లేదో అని భయపడ్డాను.. కానీ ఇంద్రగంటి గారి వల్ల బాగానే చేశాననిపించింది. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులే చెప్పాలి.

విజన్ మొత్తం ఇంద్రగంటిగారిదే..

నేను, అవసరాల, వెన్నెల కిషోర్, తనికెళ్లభరణి.. నాలుగురమూ దర్శకులమే. మేం నలుగురం కలిసి ఒక సినిమాలో నటించడం వలన డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కు చేతులు ఎక్కువ పడ్డాయని చాలామంది అనుకొన్నారు. కానీ.. సినిమాలో విజన్ మొత్తం ఇంద్రగంటిగారిదే. ఆయన ప్రతి పాత్రను తీర్చిదిద్దిన తీరు.. కామెడీని పండించిన విధానం "అమీ తుమీ"లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

రొమాన్స్ చేయగలుగుతానో లేదో అనే సందేహపడేవారు..

"పంజా" చేస్తున్నప్పుడు "నీ మొహానికి విలన్ ఏంట్రా?" అనేవారు. ఆ తర్వాత "కిస్" సినిమా చేస్తున్నప్పుడు "రొమాన్స్ చేయగలవా" అన్నారు. ఇప్పుడు "అమీ తుమీ"కి కూడా అదే "నేను కామెడీ చేయగలనా?" అనే సందేహం నాతోపాటు చాలామంది వ్యక్తపరచారు. సో ఆ సినిమాల రిజల్ట్స్ చూశాం. ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ చూడాలి.

క్షణం కెరీర్ కి పెద్ద మైనస్ అయిపోద్దనేవారు..

"క్షణం" సినిమాలో నాకు ఒక కూతురు ఉంటుంది అంటే.. ఇప్పుడే కదా కెరీర్ స్టార్ట్ అయ్యింది అప్పుడే తండ్రి పాత్ర ఏమిట్రా, కెరీర్ కి ప్రోబ్లమ్ అవుతుంది అనేవారు. కానీ.. నేను నమ్మకంతో ఆ సినిమా చేశాను. రిజల్ట్ మీ అందరికీ తెలిసిందే. ఒక నటుడిగా పాత్రను పండించడమే నాకు తెలుసు, అంతే తప్ప.. అది ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనేది నేను పట్టించుకోను.

బాహుబలి బ్రతికించింది..

అప్పటికే "కిస్" సినిమా ఫ్లాప్ అయ్యి మానసికంగా కృంగిపోయి ఉన్న తరుణంలో "బాహుబలి" సినిమాలో ఆఫర్ లభించడం ఆ సినిమా విడుదలయ్యాక నాకు మంచి పేరు లభించడంతో కాస్త నిలదొక్కుకున్నాను.

ఆయనుండడం వల్లే నాకు పేరొచ్చింది..

"పంజా" సినిమాలో పవన్ కళ్యాణ్ గారికంటే నా క్యారెక్టర్ ఎక్కువ హైలైట్ అయ్యింది అని చాలామంది అంటుంటారు. కానీ.. వాళ్ళందరికీ చెప్పదలుచుకొనేది ఒక్కటే.. "ఆయన ఉండడం వల్లే నేను హైలైట్ అయ్యాను, నాకు పేరొచ్చింది".

డైరెక్షన్ చేస్తాను కానీ..

మళ్ళీ డైరెక్షన్ చేస్తారా అంటే.. చేస్తా కానీ అందులో నటించను. ఒక 40-50 కథలున్నాయి నా దగ్గర. అయితే.. వాటిలో పనికొచ్చేవి ఎన్ని అనేది మాత్రం తెలియదు!