బెంగాల్ విజయం తర్వాత ప్రశాంత్ కిషోర్ షాకింగ్ ప్రకటన

ఎన్నికల వ్యూహకర్త అనగానే గుర్తొచ్చే పేరు ప్రశాంత్ కిషోర్(పీకే). ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన బాధ్యతను తన భుజస్కందాలపై ఎత్తుకున్నారంటే ఆ రాష్ట్రాల విజయం పక్కా అని రాసి పెట్టుకోవాల్సిందే. తాజాగా ఆయన పశ్చిమ బెంగాల్‌లో  మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీకి తాజాగా అసాధారణ విజయాన్ని కట్టబెట్టారు. ముందుగా సవాల్ చేసి మరీ చెప్పినట్టుగానే బీజేపీని కేవలం రెండంకెల స్థానాలకే పరిమితం చేశారు. ఇక ఆయన తదుపరి స్టెప్ ఏంటి? ఏ రాష్ట్ర బాధ్యతను స్వీకరించి ఆ రాష్ట్రాన్ని విజయ తీరాలకు చేర్చబోతున్నారని దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఆయన షాకింగ్ న్యూస్ చల్లగా చెప్పేశారు.

ఎన్నికల వ్యూహకర్తగా తాను వైదొలగనున్నట్టు పీకే ప్రకటించారు. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ నిర్ణయాన్ని పీకే వెల్లడించారు. ఇప్పుడు తాను చేస్తున్న పనినే ఇక మీదట కొనసాగించాలని అనుకోవడం లేదన్నారు. ఇప్పటికే ఎంతో చేశానని ఇకపై తాను బ్రేక్ తీసుకోవాల్సిన తరుణం వచ్చేసిందన్నారు. జీవితంలో ఇంకేదో చేయాలని... ఈ రంగం నుంచి తప్పుకోవాలనుకుంటున్నానని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఊహించని షాక్ ఇచ్చారు. తిరిగి రాజకీయాల్లో చేరుతారా అనే ప్రశ్నకు తానొక విఫల రాజకీయనాయకుడినని... ఇక మీదట ఏం చేయాలనేది ఆలోచించాలని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

బెంగాల్ ఎన్నికల ఫలితాలపై పీకే మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఏకపక్షంగా వచ్చినట్టు కనిపిస్తున్నప్పటికీ.. దాని వెనుక పెద్ద పోరే జరిగిందన్నారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల కమిషన్ కూడా పక్షపాతంతో వ్యవహరించిందని.. తమ ప్రచారాన్ని చాలా కష్టతరం చేసిందన్నారు. అయితే తాము మాత్రం వెనుకడుగు వేయలేదని.. గట్టి నమ్మకంతో పని చేశామని పీకే వెల్లడించారు. అనుకున్న దాని కంటే టీఎంసీని ఎక్కువ సీట్లలో ప్రజలు గెలిపించారని పీకే పేర్కొన్నారు.