సుప్రీం దెబ్బతో 10వేల కోట్లు చెల్లించిన ఎయిర్‌టెల్‌

  • IndiaGlitz, [Monday,February 17 2020]

టెలికాం సంస్థలు కోట్లాది రూపాయిలు ప్రభుత్వానికి బకాయిపడ్డాయని.. ఇంతవరకూ చెల్లించలేదన్న వార్తలను మనం చాలా రోజులుగా వింటూనే ఉన్నాం. అయితే.. సుప్రీం కోర్టు పలు మార్లు చీవాట్ల పెట్టినా ఎలాంటి మార్పు రాలేదు. అయితే టెలికాం సంస్థలు మాత్రం గడువు కోరడంతో కొద్దిరోజుల క్రితం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తాజాగా.. ఏజీఆర్ ఛార్జీల బకాయిల్లో భాగంగా రూ. 10,000 కోట్లను టెలికాం శాఖకు సోమవారం చెల్లించింది. అయితే.. ఎయిర్‌టెల్‌ తన మొత్తం బకాయిలు 35,586 కోట్లు ఉండగా.. అందులో నుంచి 10 వేలు కోట్లు మాత్రమే చెల్లించింది. మిగతా మొత్తాన్ని త్వరలోనే చెల్లిస్తామని వెల్లడించింది. ఈ మేరకు భారతీ ఎయిర్‌టెల్ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఎయిర్‌టెల్ ప్రకటన!

‘భారతి ఎయిర్‌టెల్‌లో విలీనం అయిన టెలినార్ ఇండియాకు సంబంధించి బకాయిల్లో రూ. 9500 కోట్లు చెల్లించాము. భారతి హెక్సాకోమ్ తరపున మరో రూ. 500 కోట్ల రూపాయలు చెల్లించాం’ అని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజా చర్యతో దేశీయ స్టాక్ మార్కెట్లో ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

మిగిలిన కంపెనీల పరిస్థితి ఇదీ..!

కాగా.. వొడాఫోన్ ఐడియా మాత్రం మరింత గడువును కోరింది. టెలికాం లైసెస్సు ఫీజు, స్పెక్ట్రం వినియోగ ఛార్జీల కింద ప్రభుత్వానికి టెలికాం సంస్థలు మొత్తం రూ.1.47 లక్ష కోట్లు బకాయిలు ఉన్న విషయం తెలిసిందే.