వచ్చేసింది.. త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా: అజయ్ భూపతి

టాలీవుడ్‌ని కరోనా మహమ్మారి వదిలేలా లేదు. ఇటీవల కరోనా కారణంగా తరచూ తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వార్తల్లో నిలుస్తున్నారు. నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌తో తొలిసారిగా టాలీవుడ్‌లో కరోనా ఎంట్రీ ఇచ్చింది. ఆయన వెంటనే కోలుకున్నప్పటికీ కరోనా మాత్రం టాలీవుడ్ నుంచి ఎగ్జిట్ అయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు. ఆ తరువాత రాజమౌళి కుటుంబానికి కరోనా పాజిటివ్ అని తేలడం.. ఆయన ఇటీవలే కోలుకున్నానని ప్రకటించడం కూడా జరిగిపోయాయి. తాజాగా మరో దర్శకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

‘ఆర్ఎక్స్ 100’ మంచి హిట్ కొట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్న దర్శకుడు అజయ్ భూపతి. కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన పరీక్ష చేయించుకోవడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనిని కూడా ఆయన సింపుల్‌గా రెండు ముక్కల్లో తేల్చేశారు. ‘వచ్చేసింది’ అని ఒక ట్వీట్.. ‘త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా’ అని మరో ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సైతం కరోనాతో బాధపడుతున్నారు. సంచలన దర్శకుడు ఆర్జీవీకి సైతం కరోనా వచ్చినట్టు ‘మర్డర్’ చిత్రానికి సంబంధించిన కేసు విచారణ సమయంలో ఆయన లాయర్ కోర్టుకు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా అజయ్ భూపతికి సైతం కరోనా సోకడంతో టాలీవుడ్‌లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం అజయ్ భూపతి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. అందులో ఒక హీరోగా శర్వానంద్ ఫిక్స్ కాగా మరో హీరో కోసం వెతుకుతున్నారు.