బీజేపీ నేతను లైవ్‌లోనే చెప్పుతో కొట్టిన అమరావతి జేఏసీ కన్వీనర్

  • IndiaGlitz, [Wednesday,February 24 2021]

జోరుగా సాగుతున్న టీవీ చర్చలో బీజేపీ నేత మాట జారారు. దీంతో జేఏసీ నేత కోపాన్ని అణచుకోలేకపోయారు. బీజేపీ నేతను చెప్పుతో కొట్టారు. అంతా చూస్తుండగానే జరిగిపోయిన ఈ అనూహ్య పరిణామానికి తెలుగు రాష్ట్రాలు నివ్వెరపోయాయి. సదరు టెలివిజన్ ఛానెల్ సైతం ఈ పరిణామం పట్ల స్థానువైనా వెంటనే తేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై మీమ్స్, సెటైర్స్ భారీగానే పడుతున్నాయి. అయితే బీజేపీ నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి.

వైసీపీ ప్రభుత్వం మంగళవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా అమరావతిని పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం సడెన్‌గా అక్కడి నిర్మాణాలను పూర్తి చేసేందుకు రూ.3000 కోట్లు కేటాయించి షాక్ ఇచ్చింది. ఇది చర్చనీయాంశంగా మారింది. ఛానళ్లు సైతం ఈ అంశంపై చర్చలు నిర్వహించాయి. దీనిలో భాగంగానే ఓ ప్రముఖ మీడియా ఛానెల్ ఏపీలోని ముఖ్య పార్టీ నేతలతో పాటు జేఏసీ నేతతో ఓ డిబేట్ నిర్వహించింది. దీనిలో భాగంగానే బీజేపీ నేత ఒకరకంగా చెప్పాలంటే జేఏసీ నేతపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు.

అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికపూడి శ్రీనివాస్‌ను ఉద్దేశిస్తూ బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి.. ‘‘నువ్వు తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకుని మాట్లాడు లేదంటే భజన చేసుకో.. లేదంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి వెళ్లి పని చెయ్యి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ భజన నేను చెయ్యాలా? నీ పెయిడ్ ఆర్టిస్ట్ పని నేను చెయ్యాల్నా? అదే భాష నేను మాట్లాడుతాను’’ అన్నారు. దీంతో శ్రీనివాస్ ఆగ్రహంతో ఊగిపోయారు. అమరావతి జేఏసీ ఏడాదికి పైగా దీక్షలు చేస్తోంది. ఈ క్రమంలో పెయిడ్ ఆర్టిస్టులంటూ విష్ణువర్దన్‌రెడ్డి అవమానకరంగా మాట్లాడటంతో శ్రీనివాస్ సహించలేకపోయారు. దీంతో ‘ఎవడురా పెయిడ్ ఆర్టిస్ట్?’ అంటూ చెప్పుతో కొట్టారు.