వెంకీతో కామెడీ చేయ‌నున్న అన‌సూయ‌

  • IndiaGlitz, [Sunday,April 29 2018]

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా  'ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' పేరుతో ఓ మల్టీస్టారర్ మూవీ  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సరదా, నిరాశల మధ్య సాగిపోయే ఈ ఎంటర్‌టైనర్‌లో అనసూయ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

బుల్లి తెర యాంక‌ర్‌గా పరిచయమై.. 'క్షణం', 'సోగ్గాడే చిన్ని నాయనా', 'గాయత్రి' సినిమాలతో నటిగా  ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ అనసూయ.. తాజాగా విడుద‌లైన‌ 'రంగస్థలం'లో రంగమ్మత్తగా క‌నిపించి మంచి నటిగా  మార్కులు కొట్టేసింది.

ఈ సినిమా తర్వాత ఆమెను మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.అందులో భాగంగా.. అనిల్ తెర‌కెక్కిస్తున్న  ఈ  మల్టీస్టారర్ మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో వెంకీ, వరుణ్‌ల‌తో క‌లిసి  అనసూయ కామెడీ చేయ‌నుంద‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే.. వరుణ్ సరసన మెహరీన్ కథానాయికగా ఎంపిక కాగా.. వెంకీ సరసన నటించే హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు.  తమన్నాతో పాటు మరికొంతమంది సీనియర్ హీరోయిన్‌ల పేర్లను కూడా చిత్ర బృందం పరిశీలిస్తోంది. మరి కొద్ది రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.