వైసీపీలో మరో ఫైర్ ‌బ్రాండ్.. దుమ్ము లేపేశారుగా..

  • IndiaGlitz, [Sunday,March 07 2021]

వైసీపీలో ఫైర్ బ్రాండ్ అంటే రోజా. తాజాగా మరొకరు కూడా వెలుగులోకి వచ్చారు. ఆమె మరెవరో కాదు స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ. ఇటీవలే ఆమె శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గం పరిధిలోని తొగరం సర్పంచ్‌గా ఆమె అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తమ గ్రామంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించే దిశగా ఆమె ముందుకు సాగుతున్నారు. తాజాగా.. తమ్మినేని వాణిశ్రీ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందుతోన్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు.

ఆ భోజనంలో ఏమాత్రం నాణ్యత లేదని గ్రహించిన వాణిశ్రీ పిల్లలకు అలాంటి భోజనం పెడతారు అంటూ ఫోన్‌లో సంబంధిత అధికారిపై నిప్పులు చెరిగారు. అధికారులు ఫైవ్‌స్టార్ హోటళ్లలో తింటూ పిల్లలకు రుచీ, పచీలేని ఆహారాన్ని అందజేస్తోన్నారంటూ మండిపడ్డారు. సాంబారా.. నీళ్లా? అంటూ మండిపడ్డారు. తనకు పది సార్లు మాట్లాడటం రాదని.. యాక్షన్‌లోకి దిగిపోతానని హెచ్చరించారు. మీరు ఫైవ్ స్టార్ హోటల్స్‌లో తింటూ చిన్నారులకు ఇలాంటి ఫుడ్ పెడతారా? అంటూ మండిపడ్డారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానన్నారు. ప్రస్తుతం వాణిశ్రీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఈ ఫుడ్డేంటి.. దీని సంగతేంటి? నువ్వు వచ్చేస్తావా.. భోం చేద్దాం ఇక్కడ? అన్నం మెతుకు మెతుకు అంటడం లేదు. హల్వా అని ఇచ్చావు.. పప్పు అన్నం కలిపేసి పులగం వండేసి.. స్వీటేసి.. రెండు జీడిపప్పు ముక్కలేసి ఇచ్చావు. ఇది సాంబారా? నీళ్లా? రసమా? ఇంట్లో ఇలాగే తింటున్నారా మీరు? వాట్సాప్ పెడతాను చూడు. మొన్న కూడా నిన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చాను అయినా కూడా సెట్‌రైట్ అవ్వట్లేదు. పదిసార్లు మాట్లాడటం చేతకాదు నాకు. యాక్షన్‌లోకి వెళ్లిపోతాను. గవర్నమెంట్ దీనికోసం కోట్లు వెచ్చిస్తుంటే.. మీరేమో ఇలాంటి ఫుడ్ పెడితే ఎలా? పిల్లలకు పులిహోరా, పులావ్ అంటూ ఇస్తున్నారు. ఆ రోజు పిల్లలసలు తినడం లేదు. తిన్నా వాంతులవుతున్నాయి. రుచీ పచీ లేకుంటే ఏమనుకుంటున్నారు? నేను ఇవన్నీ ఫోటోలు తీసుకున్నా. ఇవాళ విజయవాడ వెళుతున్నా. సీఎంని కలుస్తా. యాక్షన్‌లోకి వెళ్లిపోతా. రమ్మను మీ హెడ్ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ని తింటాడేమో అడుగుతా. మీరు ఫైవ్ స్టార్ హోటళ్లలో తింటారు. ఇక్కడున్నోళ్లమంతా వెధవలమా మేము. నేనూ తిన్నానిక్కడ రెండు ముద్దలు. ఏంటా.. స్వీట్ ఏంటి నీళ్లతో ఉడకబెట్టేసి’’ అంటూ వాణిశ్రీ ఫైర్ అయ్యారు.