close
Choose your channels

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో మరో వ్యక్తి ఆత్మహత్య

Sunday, November 8, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో మరో వ్యక్తి ఆత్మహత్య

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. కుషాయిగూడలో చెట్టుకు ఉరేసుకుని నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూ.1.10 కోట్ల లంచం కేసులో తహసీల్దార్ నాగరాజుతో పాటు ధర్మారెడ్డి కూడా జైలుకు వెళ్లారు. ఇటీవలే జైలు నుంచి బెయిల్‌పై ధర్మారెడ్డి విడుదలయ్యారు. కుషాయిగూడలోని వాసవి శివనగర్‌ కాలనీలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా.. ధర్మారెడ్డి ఆత్మహత్యపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

కాగా.. ఇటీవల జైల్లో కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చంచల్‌గూడ్‌ జైలులో బలవన్మరణానికి పాల్పడ్డారు. జైలులోని మంజీరా బ్యారక్‌లో కిటికీకి తువ్వాలుతో ఉరి వేసుకున్నారు. రూ.1.10 కోట్లు నగదు లంచంగా తీసుకుంటూ ఆగస్టు 14న అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన నాగరాజు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. కీసర మండలం రాంపల్లి దాయర గ్రామంలోని ఓ భూ వివాద పరిష్కారానికి నాగరాజు రూ.2 కోట్లు లంచం డిమాండ్‌ చేయడం.. రూ.1.10 కోట్లు నగదు తీసుకుంటూ పట్టుబడటం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కాగా.. మాజీ తహశీల్దార్ నాగరాజు కేసులో రియల్ ఎస్టేట్ బ్రోకర్ కందాడి ధర్మారెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. కీసర ఎమ్మార్వో నాగరాజుతో కలిసి భూ సెటిల్‌మెంట్లు, పట్టా పాస్‌బుక్‌లు ధర్మారెడ్డి చేయించినట్లు అధికారులు గుర్తించారు. 2011లో కుషాయిగూడ పీఎస్‌లో ధర్మారెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. ధర్మారెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇటీవలే బెయిల్‌పై విడుదలైన ధర్మారెడ్డి నేడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.