నటి పూర్ణ కేసు విచారణలో మరో కొత్త విషయం వెలుగులోకి..

  • IndiaGlitz, [Wednesday,July 01 2020]

నటి పూర్ణ(షామ్నా ఖాసిం) కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. పూర్ణను బెదిరించిన ముఠాతో మలయాళ నటుడు ధర్మజన్‌ బోల్‌గట్టికి సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయనను అదుపులోకి తీసుకుని ముఠాతో ఉన్న సంబంధాలపై దర్యాప్తును కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణలో మరో కొత్త విషయం తెలిసింది.

పూర్ణను వేధించిన ముఠా సభ్యులు మరో 8 మంది మోడల్స్‌ను కిడ్నాప్‌ చేసి డబ్బులు గుంజేందుకు యత్నించారని తెలిసిందని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే ఆ ముఠాకు సంబంధించిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు మలయాళ ఇండస్ట్రీలో హెయిర్‌ స్టైలిస్ట్‌గా పనిచేస్తున్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా వెల్లడించారు. అతడిని విచారించిన తరువాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా.. లాక్‌డౌన్ కారణంగా తన కుటుంబంతో కలిసి కేరళలో ఉంటున్న పూర్ణను సోషల్ మీడియా వేదికగా ఓ గ్యాంగ్ వేధింపులకు గురి చేసింది. మొదటగా వివాహ ప్రతిపాదన ద్వారా పూర్ణ కుటుంబ సభ్యులతో పరిచయం ఏర్పరుచుకున్న ముఠా.. అనంతరం డబ్బు గుంజేందుకు ప్లాన్ చేసింది. ఆమెకు కాల్ చేసి బెదిరింపులకు పాల్పడింది. రూ.50 లక్షలు డిమాండ్ చేసింది. క్రమక్రమంగా పూర్ణకు ముఠా నుంచి వేధింపులు పెరగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.