జోష్ పెంచిన పవన్.. మరో అప్‌డేట్ ఇచ్చేశారుగా

  • IndiaGlitz, [Friday,January 15 2021]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఆయన సినిమాలను మూడేళ్లుగా మిస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సినిమాల గురించి ఏ అప్‌డేట్ వచ్చినా.. అభిమానులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న వదిలిన ‘వకీల్‌సాబ్’ టీజర్.. నెట్టింట్లో దుమ్ము రేపుతోంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే ‘వకీల్‌సాబ్’ సినిమాకి గుమ్మడికాయ కొట్టేసి.. క్రిష్ దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించిన విషయం తెలిసిందే.

అలాగే మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పన్ కోషియమ్’ తెలుగు రీమేక్‌కు అంతా రెడీ అయింది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో ఈ మల్టీస్టారర్ తెరకెక్కనుంది. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విడుదల చేశారు. ఈ వీడియోలో సినిమాకు పని చేస్తున్న సాంకేతిక నిపుణుల పేర్లను తమన్ వెల్లడించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు, స్క్రీన్‌ప్లే అందించనున్నారు.

సాగర్ కె. చంద్ర డైరక్షన్‌లో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీతం తమన్ అందిస్తున్నారు. పవన్ భార్యగా సాయి పల్లవి, రానా భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. సుముద్రఖని, బ్రహ్మాజీ, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. కాగా.. ఈ సినిమా కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది. మొత్తానికి 2021లో జోష్ పెంచిన పవన్ వరుస సినిమాలతో అభిమానులను అలరించనున్నారు.