దర్శకుడిగా మరో యంగ్ హీరో

  • IndiaGlitz, [Tuesday,February 06 2018]

ప్ర‌తిభావంతుడైన‌ దర్శకుడు.. సినిమాకి సంబంధించిన‌ అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్ర వేస్తాడు. మంచి సినిమాని అందించ‌డాన్ని ఒక బాధ్యతగా భావిస్తూ ఉంటాడు. అందుకే, సినిమా అంటే ప్రేమ ఉండే నటులు, నటీమణులు ఒక్కసారైనా ఆ బాధ్యతను స్వీకరించాలని తపన పడతారు. నిన్నటితరం నటుల్లో మహానటుడు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ వంటి వారు ఆ తపనతో సినిమాలు చేసి విజయాలు సాధించారు. వీరి బాటలో ఈతరం నటులైన (స్వ‌త‌హాగా స‌హాయ ద‌ర్శ‌కులుగా ప‌నిచేసిన అనుభ‌వం ఉండ‌డం వ‌ల్ల‌) రవితేజ, నాని కూడా ద‌ర్శ‌క‌త్వం చేయ‌డానికి స‌రైన స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్నారు. మ‌రోవైపు కోలీవుడ్‌లో కమల్ హాసన్ ఇప్పటికే స్వీయదర్శకత్వంలో విజయాలను ఆస్వాదిస్తుండగా...ధనుష్, శింబు వంటి స్టార్ హీరోలు కూడా స్వీయదర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు.

ప్రస్తుతం తెలుగునాట యువ న‌టుడు సాయిరామ్ శంకర్.. స్వీయదర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే బాట‌లో మరో యంగ్ హీరో మంచు విష్ణు కూడా పయనించడానికి సిద్ధమ‌వుతున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. తన అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించ‌డ‌మే కాకుండా అందులో హీరోగా నటించనున్నార‌ట విష్ణు. ఇప్ప‌టికే ప్ర‌ముఖ ర‌చ‌యిత విజయేంద్రప్ర‌సాద్‌.. విష్ణుకి ఒక కథ చెప్పడం జరిగింద‌ని.. అది నచ్చి దాన్ని సమర్ధవంతంగా తెరకెక్కించే దర్శకుడి కోసం చూస్తున్న విష్ణు...ఆ చిత్రాన్ని తన సొంత బ్యానర్‌లో చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ చిత్రానికే విష్ణు దర్శకత్వం వహించే అవకాశం ఉందేమోనన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. విష్ణు కీలకపాత్ర పోషించిన గాయత్రి' సినిమా ఈ నెల 9న విడుదల కానుండగా...అతి త్వ‌ర‌లోనే హీరోగా న‌టించిన‌ ఆచారి అమెరికా యాత్ర' విడుదల కాబోతోంది.