సంపర్క్ క్రాంతి-ఎస్9 : కరోనా భయంతో వణికిపోతున్న కరీంనగర్!

  • IndiaGlitz, [Thursday,March 19 2020]

కరోనా పేరెత్తితో తెలుగు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. ఇరు రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్‌లు పెరిగిపోతుండటం.. మరోవైపు అనుమానిత కేసులు సైతం ఎక్కువవుతుండటంతో ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 13కి పెరిగింది. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఒక్కరూ లేరు.. అందరూ విదేశాల నుంచి వచ్చినవారే. మరీ ముఖ్యంగా విమాన, రైలు ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే.. ఈ నెల 14న ఢిల్లీ నుంచి సంపర్క్‌క్రాంతి-ఎస్9 బోగీలో 11మంది ప్రయాణికులు రామగుండం వచ్చారు. కరీంనగర్‌లో ఒక్కరోజంతా గడిపారు. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అందులో ప్రయాణించిన, కరీంనగర్ వాసులు, రామగుండం వాసులు బెంబేలెత్తిపోతున్నారు.

ఇంతకీ వాళ్లంతా ఎవరు!?

అయితే.. ఆ బోగీలో ఇండోనోషియాకు చెందిన వారు కాకుండా ఎవరెవరు ప్రయాణించారు..? తెలంగాణకు చెందిన వారా..? లేకుంటే మరో ప్రాంతానికి చెందిన వారా..? అసలు వాళ్లంతా ఎవరు..? ఎందుకొచ్చారు..? ఏ పనిమీద తెలంగాణకు వచ్చారు..? అని కనుగొనే పనిలో రైల్వే, జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. అయితే మొత్తం 13 మందిని గుర్తించిన పోలీసులు, అధికారులు వారిని ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు కరీంనగర్ కలెక్టరేట్ చుట్టూ 3 కిలోమీటర్ల మేర ఆంక్షలు విధించారు. జనం ఎవరూ బయటకు రావొద్దని కలెక్టర్ ఆదేశించారు. 4 రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలని సూచించారు.

ప్రతి ఇంటికీ వెళ్లి..!

జిల్లా వ్యాప్తంగా మొత్తం 100 ప్రత్యేక బృందాలతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే ఆయా ప్రాంతాల్లో నిర్బంధం విధించాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి గంగుల కమలాకర్ పర్యటించి, వైద్య సిబ్బందితో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు. ఈ క్రమంలో ముందస్తుగా దుకాణాలు మూసివేయించారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిలో 20 ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అంతేకాదు.. రెండు మెడికల్ కాలేజీల్లోనూ 50 బెడ్లు సిద్ధం చేశామని అధికారులు మీడియాకు వెల్లడించారు. కలెక్టరేట్ పరిధిలో ఇండోనోషియా వాసులు బసచేసినట్లు గుర్తించిన పోలీసులు.. ఆ ప్రాంతాన్ని తమ పరిధిలోకి తీసుకున్నారు.