ఆ ఆందోళన వెనుక రజినీ సతీమణి?.. సంచలన ఆడియో విడుదల..

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌‌కు సంబంధించిన ఓ సంచలన ఆడియో బయటకు వచ్చింది. అది ఎంత నిజమో తెలియదు కానీ తమిళ రాజకీయాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజినీ.. అనంతరం తన ఆరోగ్య కారణాల రీత్యా నిర్ణయాన్ని మార్చుకున్న విషయం తెలిసిందే. తాను రాజకీయాల్లోకి రాబోనని స్పష్టం చేస్తూ ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

రజినీ రావాలంటూ నగరంలో ఆందోళన నిర్వహించారు. దీంతో మరోసారి రజినీ ట్విట్టర్ వేదికగా అభిమానులకు నచ్చజెప్పారు. అయితే ఇటీవల రజినీ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు నిర్వహించిన ఆందోళనల వెనుక రజినీకాంత్ సతీమణి లత రజనీకాంత్‌ ఉన్నారని టాక్ వినబడుతోంది. ఈ ఆందోళనకు ఆమె పరోక్షంగా సాయం చేశారని అభిమాన సంఘం నిర్వాహకుడు, స్థానిక తిరువాన్మియూర్‌ రజనీ మక్కల్‌ మండ్రం కార్యదర్శి భాస్కర్‌ సంచలన ఆడియో విడుదల చేశారు. మంగళవారం విడుదల చేసిన ఆడియోలో.. రజనీ రాజకీయ పార్టీ స్థాపిస్తారని గట్టి నమ్మకంతో ఎదురుచూశామని, అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం అభిమానులను నిరాశకు గురిచేసిందన్నారు.

కాగా.. రజినీ రాజకీయాల్లో రావాలంటూ.. నుంగంబాక్కం వళ్లువర్‌కోట్టం సమీపంలో భారీ స్థాయిలో అభిమానులు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన వేదిక, 500 వాటర్‌ క్యాన్లు, మొబైల్‌ టాయ్‌లెట్లు తదితర సహాయాలను రజనీకాంత్‌ సతీమణి లత పరోక్షంగా అందించారని భాస్కర్ ఆ ఆడియోలో వెల్లడించారు. అలాగే ఆమె అసిస్టెంట్‌ సంతోష్‌ కూడా వీటిని పరిశీలించి వెళ్లారని భాస్కర్ స్పష్టం చేశారు. కాగా, రజనీ మక్కల్‌ మండ్రం ప్రకటించిన ఆందోళనకు అనుమతి జారీ చేయరాదని మక్కల్‌ మండ్రం జిల్లా కార్యదర్శి ఏవీకే రాజా పోలీసులకు చేసిన ఫిర్యాదును.. వాపసు తీసుకొనేలా చేసింది ఎవరనేది కూడా ఆడియో సంభాషణలో ఉండటం గమనార్హం.