తెలంగాణలో 6 కరోనా పాజిటివ్ కేసులు.. ఆషామాషీగా తీసుకోకండి!

  • IndiaGlitz, [Wednesday,March 18 2020]

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియా ముందుకొచ్చి ప్రకటన చేశారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అని తెలిపారు. కరోనా నియంత్రణపై పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

రాబోయే 10-15 రోజులు జాగ్రత్త!
‘క్వారంటైన్ సెంటర్లు కలెక్టర్ల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో స్కూల్స్ మూసేసింది ఇంట్లో ఉండటానికి మాత్రమే. మాల్స్, పార్క్‌లు అని బయటికి తిరగొద్దు. పిల్లల్ని బయటికి వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రులను కోరుతున్నాం. వైరస్ విషయంలో దయచేసి ఆషామాషీగా తీసుకోకండి. నిర్లక్ష్యంగా ఉంటే.. ఇటలీలో పరిస్థితి ఎలా ఉందో.. ఏమైందో చూస్తున్నాం. అమెరికా లాంటి దేశమే.. కర్ఫ్యూ వాతావరణం సృష్టిస్తోంది. దయచేసి తెలంగాణ ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అత్యవసరం అయితే తప్ప.. ప్రజలెవ్వరూ బయటికి రావొద్దు. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేశాం. రాబోయే 10-15 రోజులు జాగ్రత్తగా ఉండాలి’ అని మంత్రి ఈటల మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

దేశ వ్యాప్తంగా పరిస్థితి ఇదీ..
ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. కాగా నిన్న అనగా మంగళవారం ఒక్క రోజే దేశంలో కొత్తగా 24 కేసులు నమోదుకావడం గమనార్హం. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 147కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బుధవారం ఉదయం ఓ ప్రకటన వెలువరించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 42 కేసులు నమోదయ్యాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల కరోనా పాజిటివ్ కేసులు కూడా ఉన్నాయి.