భూమిక‌.. ఈ చిత్రాల‌తో బ్రేక్ చేస్తుందా?

  • IndiaGlitz, [Tuesday,April 17 2018]

‘ఖుషి’, ‘ఒక్కడు’, ‘సింహాద్రి’ వంటి ఘ‌న‌విజ‌యాల‌తో స్టార్‌డ‌మ్‌ను పొందిన‌ కథానాయిక భూమిక చావ్లా. ‘మిస్సమ్మ’, ‘అనసూయ’ వంటి నాయికా ప్రాధాన్యమున్న సినిమాల్లో కూడా న‌టించి క‌థానాయిక‌గా తనదైన ముద్ర వేసారు. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకుని కొంత కాలం తెలుగు పరిశ్రమకు దూరమైన భూమిక..  తాజాగా నాని హీరోగా నటించిన ‘ఎం.సి.ఎ’తో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో నానికి వదిన పాత్రలో చాలా హుందాగా నటించారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నాగ చైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సవ్యసాచి’లో నటిస్తున్నారు ఈ సీనియ‌ర్ హీరోయిన్‌. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో చైతుకి అక్క పాత్రలో భూమిక కనిపించనున్నారు. అంతేగాకుండా.. సమంత ప్రధాన పాత్రలో మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘యు టర్న్’ సినిమాలో కూడా భూమిక ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

అంటే.. ప్ర‌స్తుతం భూమిక చేస్తున్న రెండు సినిమాలు కూడా అక్కినేని కుటుంబానికి చెందిన న‌టుల సినిమాలేన‌న్న‌మాట‌. ఇక్క‌డ ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. భూమికకు, అక్కినేని కుటుంబానికి మంచి అనుబంధ‌మే ఉంది.  భూమిక తొలి చిత్రమైన‌ ‘యువకుడు’లో సుమంత్ హీరో కాగా.. నాగార్జున నిర్మించారు. అలాగే.. నాగార్జునకు జంటగా ‘స్నేహమంటే ఇదేరా’లో నటించారు భూమిక. అయితే.. అక్కినేని కుటుంబంతో కలిసి నటించిన ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేదు. ఈ నేప‌థ్యంలో.. గతంలో రెండుసార్లు కూడా అక్కినేని కుటుంబానికి కలిసిరాని భూమిక.. ప్రస్తుతం  చేస్తున్న సినిమాలతో తన నెగెటివ్ సెంటిమెంట్‌ను అధిగ‌మిస్తారేమో చూడాలి.