రాజధానిపై బొత్స మరోసారి కామెంట్స్.. కలకలం!

  • IndiaGlitz, [Wednesday,October 23 2019]

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఒకట్రెండు సార్లు తన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అయిన బొత్స తాజా వ్యాఖ్యలతో అసలేం జరుగుతోందో తెలియక రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అవినీతికి, దోపిడీకి తావులేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండే మంచి రాజధాని నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు హర్షించే రీతిలో రాజధాని మా ప్రభుత్వ హయాంలోనే కట్టి తీరుతామన్నారు. చంద్రబాబు ఐదేళ్లు అధికారంలోకి ఉండి అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేపట్టలేకపోయారని విమర్శలు గుప్పించారు.

నోరు తెరిస్తే చాలు అబద్ధాలే!

‘ముఖ్యమంత్రి జగన్‌ పరిపాలనలో నూతన విధానం తీసుకువచ్చారు. చంద్రబాబులో ఎందుకు అసహనం, ఆక్రోశం ఉంది. ఆయన ఆవేదన, అక్రోశం చూస్తే బాధేస్తోంది. మూడు రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తూ చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబులో ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి లేవు. నోరు తెరిస్తే చాలు అబద్ధాలు, సత్యదూరపు మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారు. ఈ ఐదేళ్లలో అమరావతిలో పర్మినెంట్‌గా ఒక కట్టడమైనా కట్టారా..?. అన్ని కూడా తాత్కాలికమే.. అందులో కూడా భారీగా దోపిడీకి పాల్పడ్డారు. ప్రజలు అవకాశం ఇస్తే ఎందుకు శాశ్వతమైన నిర్మాణాలు కట్టలేకపోయారు. రూ.1.65 లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చారు. అది కాకుండా ప్రజలు మిమ్మల్ని అధికారంలో నుంచి తొలగించిన నాటికి రాష్ట్రంలో బకాయిలు పెట్టారు. రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే చంద్రబాబు పాలనలో నష్టం ఎక్కువగా జరిగిందని విమర్శించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశారు’ అని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అవినీతికి, దోపిడీకి తావులేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండే మంచి రాజధాని నిర్మిస్తాం అనడం ఓకే గానీ.. ఉన్న రాజధానిని కొనసాగిస్తామని మాత్రం బొత్స అనకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు ఏ మేరకు స్పందిస్తాయో వేచి చూడాల్సిందే మరి.