close
Choose your channels

వాహనదారులకి గుడ్‌న్యూస్: ఇక బంకుకు వెళ్లక్కర్లేదు... ఇంటి వద్దకే పెట్రోల్, డీజిల్

Wednesday, December 29, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇప్పుడు చేతిలో చిన్న మొబైల్ వుంటే చాలు.. ఏమైనా క్షణాల్లో గడప వద్దకే చేరతాయి. పళ్లు, కూరగాయలు,  పాలు, ఆహారం చివరికి మద్యం కూడా ఇంటి ముంగిటకు వచ్చేస్తోంది. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి పెట్రోల్‌, డీజిల్ కూడా చేరాయి. ఈ విధానం విజయవాడలో భారత్ పెట్రోలియం కార్పోరేషన్ (బీపీసీఎల్) అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం గాంధీనగర్‌ పెట్రోల్‌ బంకువద్ద ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం బీపీసీఎల్ సౌత్ డీజీఎం పీపీ రాఘవేంద్రరావు, ఏపీ- తెలంగాణ డీజీఎం భాస్కరరావు మాట్లాడుతూ ‘బీపీసీఎల్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని.. పెట్రోల్‌, డీజిల్‌ను బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫెసో క్యాన్‌ ద్వారా ఇంధనం సరఫరా చేస్తామని, ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని వారు హామీ ఇచ్చారు. అంతేకాకుండా గాంధీనగర్‌లోని బంకు వద్ద సిబ్బందితో సంబంధం లేకుండానే స్కాన్‌ చేసి, వినియోగదారుడే వాహనంలోకి ఇంధనం నింపుకునే సౌకర్యం ఉందని పేర్కొన్నారు. ఈ పద్ధతి ద్వారా మోసాలను అరికట్టవచ్చని, 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుందని చెప్పారు. క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ నెల రోజులపాటు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

ఇకపోతే.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. మంగళవారం నాటికి దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరు రూ. 95.41 పలుకుతుండగా, డీజిల్ లీటర్ రూ.86.67 గా ఉంది. ముంబయిలో పెట్రోల్ లీటరు రూ.109.98 ఉండగా, డీజిల్ ను రూ. 94.14గా వుంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 , డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20, డీజిల్ ధర రూ.94.62కు విక్రయిస్తున్నారు. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.51కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.59లకు పలుకుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.