షాకింగ్: ‘కరోనా’ గురించి ముందే చెప్పిన బ్రహ్మం గారు!

  • IndiaGlitz, [Wednesday,January 29 2020]

అవును మీరు వింటున్నది నిజమే.. కరోనా అనే మహమ్మరితో జనాలు ఇబ్బందులు పడతారని నాడే పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారని ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయ్. అసలు నాడు బ్రహ్మంగారు ఏం చెప్పారు..? అసలీ కథేంటో ఈ కథనంలో చూద్దాం.

భయం.. భయం..!
కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ వైరస్ బారీన పడి 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు.. 2,744 మందికి వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు చైనా ఆరోగ్య సంస్థ గుర్తించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. వీరిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఇలా రోజురోజుకు దేశాలు దాటి వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. మరోవైపు ముంబైలో ఇద్దరు, బెంగళూరు, హైదరాబాద్‌లో ఒక్కొక్కరికి కరోనా వైద్య పరీక్షలు చేయగా.. నెగెటివ్‌గా వచ్చిందని సమాచారం. ఇలా రోజురోజుకు విజృంభిస్తున్న ఈ వ్యాధితో జనాలు భయపడుతుంటే తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. అదేమిటంటే ఈ కరోనాతో జనాలు ఇబ్బంది పడతారని పోతులూరి వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారన్నదే దాని సారాంశం.

బ్రహ్మంగారు ఏం చెప్పారు!?
ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను
లక్షలాది ప్రజలు సచ్చేరయ
కోరంకియను జబ్బు కోటిమందికి తగిలి
కోడిలాగా తూగి సచ్చేరయ

ఇదే జరిగితే..!
వాస్తవానికి భారతదేశానికి ఈశాన్యంగా చైనా ఉంది.. దీన్ని బట్టే చూస్తే దైవ స్వరూపులైన బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఇది ఖచ్చితంగా కరోనా వైరసే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బ్రహ్మంగారు చెప్పిన ‘కోరంకి’ ఈ చైనా ‘కరోనా వైరస్’ ఒకటే అయితే మాత్రం పెద్ద ప్రమాదమే ముంచుకొస్తోందని జనాలు భయపడుతున్నారు. ఎందుకంటే పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పిన భవిష్యత్ ఫలితాలు జరిగిన దాఖలాలు చాలా ఉన్నాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనిపై శాస్త్రవేత్తలు, నిపుణులు, విశ్లేషకులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.