Bandla Ganesh:పదేళ్లలో కేటీఆర్‌ ఎంత దోచుకున్నారో చెప్పమంటారా..?: బండ్ల గణేశ్‌

  • IndiaGlitz, [Monday,December 25 2023]

మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)పై నిర్మాత, కాంగ్రెస్ మద్దతుదారు బండ్ల గణేశ్(Bandla Ganesh) తీవ్ర విమర్శలు చేశారు. పవర్‌ లేని వాళ్లకు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఎందుకు సార్‌ అంటూ కౌంటర్లు వేశారు. కేటీఆర్ విడుదల చేసిన స్వేదపత్రంపై ఓ వీడియోలో బండ్ల మాట్లాడుతూ లేగిస్తే గత పాలకులు అంటూ ఎంత కాలం చెబుతారు.. పదేళ్లలో మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండని ప్రశ్నించారు. తాము చెప్తాం.. గత పదేళ్లలో మీరు ఏం దోచుకున్నారో.. ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో.. మీరు, మీ నాయకుల జీవన విధానం ఎలా మారిపోయిందో.. తెలంగాణ ప్రజలు ఎంత వెనకబడ్డారు.. మీరు ఎంత ముందుకు పోయారో చెప్తాం.. చెప్పాం కాబట్టే.. ప్రజలు తమకు అధికారం ఇచ్చారని చెప్పుకొచ్చారు.

ఎందుకంత బాధ.. భయం..

ఏయ్.. అధికారం లేక మీకు నిద్ర పట్టడం లేదా? అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం గొప్పది.. మీరు బాగా చేయలేదని కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదని..ఎందుకంత బాధ.. ఎందుకంత భయం.. నిద్ర వస్త లేదా? అని మండిపడ్డారు. పదేళ్లలో మీరు చేసిన తప్పులు బయటకు వస్తాయని భయపడుతున్నారా? అని నిలదీశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందనా? ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉన్నారనా? అనుక్షణం అందరికీ న్యాయం చేస్తున్నారనా? ప్రజలు సుఖ సంతోషాలతో కళకళలాడుతున్నారనా? ఎందుకు మీకు తొందర.. ఆగండి.. అద్భుతంగా చేస్తామంటూ హితవు పలికారు.

స్వేదపత్రంపై కేటీఆర్ ప్రెజెంటేషన్..

కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా గ‌త ప్ర‌భుత్వం చేసిన దోపిడీ, అక్ర‌మాల గురించి శ్వేతప‌త్రం విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వేదప‌త్రం పేరుతో ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ఇచ్చారు. సమైక్య పాలనలో దశాబ్దాలపాటూ తెలంగాణ దగా పడిందని విమర్శించారు. 2013-14లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,12,163 ఉండగా… తాము వచ్చాక రూ.3,17,115గా చేశామన్నారు. అలాగే గత 60 ఏళ్లలో కాంగ్రెస్ పాలకులు తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని వివరించారు. దీనిపైనే బండ్ల గణేశ్ తీవ్రంగా స్పందిస్తూ కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.