దాసరి తనయులపై కేసు నమోదు.. చంపేస్తాం అంటూ బెదిరింపులు!

దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు మరణం తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా దాసరి కుమారులు అరుణ్,ప్రభు పై కేసు నమోదైంది. ఓ అప్పు వ్యవహారంలో అట్లూరి సోమశేఖర్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. దాసరి నారాయణరావు కు సోమశేఖర్ సన్నిహితంగా ఉండేవారు. దాసరి ఆర్థిక అవసరాల కోసం సోమశేఖర్ అప్పు ఇచ్చేవాడు. అలా దాసరి ఆరోగ్యం బాగా లేనప్పుడు ఆయనకు సోమశేఖర్ 2.10 కోట్ల అప్పు ఇచ్చాడు. ఆ అప్పు చెల్లించకుండానే దాసరి మరణించాడు.

దీనితో సోమశేఖర్ దాసరి తనయులని కలసి అప్పు గురించి వివరించాడు. పెద్ద మనుషుల సమక్షంలో తాము అప్పు చెల్లిస్తామని.. అయితే 2.10 కోట్లు చెల్లించలేమని.. 1.15 కోట్లు చెల్లిస్తామని అరుణ్, ప్రభు.. సోమశేఖర్ కు హామీ ఇచ్చారు. ఆ తర్వాత పలు మార్లు సోమశేఖర్ తన అప్పు చెల్లించాలని దాసరి తనయులని కోరినా వారు ముఖం చాటేశారు.

దీనితో సోమశేఖర్ ఇటీవల నేరుగా జూబ్లీహిల్స్ లోని దాసరి నివాసానికి వెళ్లి అరుణ్, ప్రభు లని నిలదీశాడు. దీనితో అరుణ్, ప్రభు తమ ఇంటికి ఇంకోసారి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని సోమశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనితో పోలీసులు దాసరి తనయులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

దాసరి నారాయణ రావు 2017లో అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. పలు మార్లు దాసరి కుటుంబంలో ఆర్థిక వ్యవహారాలు, ఆస్తుల గురించి వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి.