రెండువేల నోటు రద్దుపై తేల్చేసిన కేంద్రం..
- IndiaGlitz, [Tuesday,December 10 2019]
పెద్ద నోట్ల రద్దు సమయంలో నగదు కొరతను తీర్చేందుకు 2వేల రూపాయల నోటును కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు గత కొద్దిరోజులుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. ఈ ప్రభావంతో రెండు వేలు నోటు అంటే జనాలు ఒకింత భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రోజులుగా ఈ పుకార్లు పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ కేంద్రం స్పందించకపోవడంతో జనాల్లో మరింత ఆందోళన పెరిగింది. మరోవైపు.. రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టడంతో దేశంలో నల్లధనం పెరిగిపోయిందనే పుకారు కూడా మొదలైంది.
మంగళవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. రాజ్యసభలో ఎంపీ విశ్వంభర్ ప్రసాద్ నిషద్ ఇవాళ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయం లేవనెత్తగా.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చుకున్నారు. ‘ఈ ప్రచారం అంతా అబద్ధమే. పుకార్లు ఎవరూ నమ్మకండి. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నల్లధనాన్ని నిర్మూలించేందుకు, నకిలీ నోట్లను తొలగించేందుకే గతంలో నోట్ల రద్దు చేశారంతే’ అని ఠాకూర్ స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే.. కేంద్ర మంత్రి క్లారిటీ ఇవ్వడంతో దేశ ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు కాసింత ఫుల్స్టాప్ పడినట్లయ్యింది.