వచ్చే వారం కరోనా టీకాకు.. కేంద్రం అనుమతి!

  • IndiaGlitz, [Thursday,December 24 2020]

కరోనా నుంచి విముక్తి కల్పించేందుకు పలు సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రానున్నాయి. అయితే భారత్‌లో వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే అనుమానాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన వస్తోంది. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకాకు అత్యవసర వినియోగం కింద అనుమతులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని రాయిటర్స్ కథనం వెల్లడించింది. కాగా.. తయారీ సంస్థలన్నీ టీకాపై అధికారులు కోరిన అదనపు సమాచారాన్ని అందించాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చేవారం అనుమతులు మంజూరయ్యే అవకాశముందని తెలుస్తోంది.

భారత్ బయోటెక్‌తో పాటు సీరం ఇన్‌స్టిట్యూట్, ఫైజర్ సంస్థలు కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ఫైజర్ టీకా ధర ఎక్కువగా ఉండటం.. భద్ర పరిచేందుకు సైతం ఇబ్బందికర పరిస్థితులుండటంతో ప్రభుత్వం ఈ టీకాను పక్కనబెట్టినట్టు తెలుస్తోంది. కాగా.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్.. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకాతో కలిసి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం.. ధర తక్కువ.. రవాణాకు అనుకూలం.. భద్రపరిచే అవకాశాలు సైతం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఈ టీకా వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

భారత్‌లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలోనే టీకాను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. మరోవైపు బ్రిటన్‌లో కరోనా కొత్త రకం వేరియంట్ వెలుగు చూసిన నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే భారత్ సహా పలు దేశాలు బ్రిటన్ నుంచి విమాన రాకపోకలపై ఆంక్షలు విధించాయి. ఇప్పటికే బ్రిటన్ నుంచి భారత్‌కు చేరుకున్న ప్రయాణికుల్లో 25 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే అది కొత్త వైరస్ రకమా.. కాదా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే భారత్‌లోని పలు రాష్ట్రాలు అప్రమత్తమై నైట్ కర్ఫ్యూని విధిస్తున్నాయి.