ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం.. వాట్ నెక్స్ట్ జగన్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని.. అధికార వైసీపీ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రధాని మోదీతో భేటీ అయ్యి హోదాపై చర్చించారు. మున్ముంథు మరిన్నిసార్లు మోదీతో భేటీ అయ్యి హోదా అడుగుతూనే ఉంటానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. ఇదిలా ఉంటే.. పార్లమెంట్ సమావేశాల్లో సైతం వైసీపీ ఎంపీలు.. హోదా కచ్చితంగా ఇవ్వాలని.. విభజన అనంతరం రాష్ట్రం కోలుకోవాలంటే హోదానే సంజీవని అని గళమెత్తుతున్నారు.
తేల్చేసిన కేంద్రం..!
అయితే సోమవారం నాడు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. హోదాపై క్లారిటీ ఇచ్చారు. ఏపీ ఒక్క రాష్ట్రానికే కాదు.. ఇకపై ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ప్రణాళికా మద్దతు కోసమే ప్రత్యేక హోదా ఇవ్వాలని జాతీయాభివృద్ది మండలి సిఫారసు చేసిందని.. పారిశ్రామిక రాయితీలతో సంబంధం లేదని ఈ సందర్భంగా నిర్మల తేల్చి చెప్పారు. కాగా.. తెలుగు రాష్ట్రాలతో పాటు 7 రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయని సభా ముఖంగా ఆమె వెల్లడించారు. లోకసభలో బీహార్ ఎంపీ కౌసలేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు.. పై విధంగా నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
వాట్ నెక్స్ట్ జగన్..!
ఇదిలా ఉంటే ఏపీలో పరిస్థితేంటి..? ఏపీలో అధికారం దక్కించుకున్న వైసీపీ ప్లాన్ ఏంటి..? ఏపీ నుంచి పదే పదే డిమాండ్స్ వెళ్లడం.. ఢిల్లీ నుంచి ఇచ్చే ప్రసక్తే లేదని ఇలా సమాధానాలు రావడం షరామామూలైపోయింది. అయితే ఈ వ్యవహారంలో వైఎస్ జగన్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.