close
Choose your channels

ఢిల్లీ ఘటనపై కేంద్రం సీరియస్...

Wednesday, January 27, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన విధ్వంస ఘటనలపై కేంద్రం సీరియస్ అయ్యింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడాన్ని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలను బుధవారం రివ్యూ చేసిన కేంద్ర హోంశాఖ... ముఖ్యంగా ఎర్రకోటపై ఇతర జెండాలు ఎగురవేసిన ఘటనపై హోంశాఖ దృష్టి సారించింది. జెండాలు ఎగురవేసిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ ఆదేశించింది. మరోవైపు పోలీస్ శాఖకు సైతం నిందితులను గుర్తించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దోషులను గుర్తించాలని సూచించింది.

ఈ మేరకు ఐబీ చీఫ్‌తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఇప్పటికే ఈ ఘటనకు కారకులైన వారిపై పోలీసులు 35 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. 200 మంది నిందితులను గుర్తించారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కేసు విచారణ చేపట్టింది. ఈ కేసులో ఐబీ, కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

కాగా.. నిన్న హింస జరిగిన ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు తెలుస్తోంది. నిన్నటి నుంచి అవాంఛనీయ ఘటనలేవీ చోటు చేసుకోలేదు. కాగా.. నిన్న సాయంత్రమే 15 కంపెనీల పారా మిలిటరీ దళాలను కేటాయించిన కేంద్రం.. అవసరమైతే మరిన్ని బలగాలను మోహరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఫిబ్రవరి 1న పార్లమెంటు ముట్టడించాలని గతంలోనే రైతు సంఘాలు నిర్ణయించాయి. కాగా నిన్న జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పార్లమెంటు ముట్టడి అంశంపై రైతు సంఘాలు పునరాలోచనలో పడినట్టు సమాచారం. పార్లమెంట్‌ ర్యాలీని వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మీదట నిర్వహించాల్సిన కార్యాచరణపై రైతు సంఘాలు పునరాలోచించనున్నట్టు తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.