కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. వేతనాలు 25% పెంపు

  • IndiaGlitz, [Friday,May 31 2019]

కేంద్రంలో వరుసగా రెండోసారి కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం శుక్రవారం నాడు తొలిసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని కార్యాలయంలో వేదికైంది. ఈ కేబినెట్‌ భేటీలో కొత్త మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ‘ప్రధాన మంత్రి స్కాలర్‌షిప్ స్కీమ్’కు సంబంధించిన ఫైల్‌పై మోదీ తొలి సంతకం చేశారు. ఉగ్రవాద దాడులు, నక్సల్స్‌ దాడిలో అమరులైన జవాన్ల పిల్లలకు నెలనెలా ఇచ్చే ఉపకార వేతనాల అంశంపై ప్రధాని కీలక నిర్ణయం తీసుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు. ఈ వేతననాలు 25 శాతం పెంచుతూ శుక్రవారం సాయంత్రం మోదీ శుభవార్త అందించారు.

శుక్రవారం పూట తియ్యటి శుభవార్త..

కాగా.. ఇదివరకు బాలురకు నెలకు ఇచ్చే రూ.2 వేల ఉపకార వేతనం వస్తుండగా ఇప్పుడు రూ.2500లకు.. అదేవిధంగా బాలికలకు ఇచ్చే రూ.2250 ఉపకార వేతనాన్ని రూ.3 వేలకు పెంచుతూ మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ‘భారత రక్షణ నిధి’ నుంచి ఈ ఉపకార వేతనాలను అందించడం జరుగుతుంది. ఇప్పటివరకూ కేంద్ర, పారా మిలటరీ బలగాలకు మాత్రమే వర్తింపజేస్తున్న ఈ ఉపకార వేతనాలను ఇకపై రాష్ట్రాలకు విస్తరించాలని మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర పోలీసు విభాగాల నుంచి ఏడాదికి 500 మందిని ఎంపిక చేయనున్నారు. వీటన్నింటికి నోడల్‌ మంత్రిత్వ శాఖగా కేంద్ర హోంశాఖ ఉండనుంది.

ఈ భేటీలో హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిపి 24 మంది క్యాబినెట్‌ మంత్రులు, 9 మంది స్వతంత్ర హోదా కల్గిన మంత్రులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. జూన్ 17 నుంచి జులై 26 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 19న స్పీకర్ ఎన్నిక ఉంటుందని సమాచారం.