close
Choose your channels

సడన్‌గా చంద్రబాబు విశాఖ టూర్ రద్దు.. ఎందుకంటే..!

Monday, May 25, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సడన్‌గా చంద్రబాబు విశాఖ టూర్ రద్దు.. ఎందుకంటే..!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీకి రావడానికి చాలా రోజుల తర్వాత డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి ఎట్టకేలకు అనుమతి వచ్చింది. అయితే అనుమతి వచ్చిన కొన్ని గంటల్లోనే చంద్రబాబు విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి ఆయన సోమవారం ఉదయం 10 గంటలకు విశాఖలో పర్యటించాల్సి ఉంది. పర్యటనలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ ఘటనా బాధిత కుటుంబాలను పరామర్శించాల్సి ఉంది. అనంతరం సోమవారం సాయంత్రం అక్కడ్నుంచి నేరుగా అమరావతి కరకట్టపై ఉన్న తన నివాసానికి చేరుకోవాల్సి ఉంది. అయితే హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తారు కానీ.. విశాఖ టూర్ మాత్రం రద్దు చేసుకున్నారు. ఇందుకు కారణం విమానాలు రద్దు కావడమే. అందుకే సడన్‌గా బాబు కూడా తన టూర్‌ను రద్దు చేసుకున్నారు.

విమానాల రద్దు వెనుక..

విశాఖపట్నం, విజయవాడకు విమానాలు రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్యాసింజర్లు తక్కువగా ఉండటం, ఇతర కారణాలతో విమానాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర విమానయానశాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. వాస్తవానికి దేశవ్యాప్తంగా దేశీయ విమాన సర్వీసులు మే 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మే- 26 నుంచి ఎగురుతాయని కేంద్ర మంత్రి ప్రకటించారు. అలాగే.. పశ్చిమ బెంగాల్లో మే 28వ తేదీ నుంచి విమనాలు నడుస్తాయన్నారు. వివిధ రాష్ట్రాలతో తీవ్రంగా చర్చించిన తర్వాత దేశీయ విమానయానంలో పౌర విమానయాన శాఖ కొన్ని మార్పులు చేసిందన్నారు. ఏపీలో 26 నుంచి, పశ్చిమ బెంగాల్లో 28 నుంచి విమానాలు నడుస్తాయి. ఏపీలో తొలుత ప్రకటించినదాని కంటే 1/3 వంతు మాత్రమే విమానాలు నడుస్తాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఏపీలో 26వ తేదీ నుంచి పరిమిత స్థాయిలో విమానాలు నడుస్తాయని హర్దీప్ సింగ్ పూరీ ప్రకటించారు. అంటే.. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సోమవారం రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ ఎయిర్ పోర్టులను మూసివేయనున్నారన్న మాట. దీంతో చంద్రబాబు చేసేదేమీ లేక విశాఖ టూర్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

రెండ్రోజులుగా హైడ్రామా..

లాక్ డౌన్‌కు ముందే వారంతాల్లో భాగంగా చంద్రబాబు హైదరాబాద్‌కు వచ్చేశారు. అయితే ఆ తర్వాత వరుసగా లాక్ డౌన్‌లు విధించడంతో ఇక చేసేదేమీ లేక ఇక్కడే ఉండిపోయారు. విశాఖ ఘటన జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన రెక్వెస్ట్ చేసినప్పటికీ అనుమతి రాలేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఆయన ఇంట్లోనే ఉండిపోయారు. ప్రస్తుతం లాక్ డౌన్‌లో భాగంగా విమానయానానికి సడలింపులు ఉండటంతో ఏపీకి పయనమయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల డీజీపీలకు అనుమతివ్వాలని కోరుతూ ఆన్‌లైన్‌లో లేఖలు రాశారు. వెంటనే స్పందించిన తెలంగాణ డీజీపీ అనుమితిచ్చారు. అయితే శనివారం లేఖ రాసినప్పటికీ ఆ రోజు మొత్తం ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వరకూ ఏపీ నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. ఆఖరికి రాత్రి 9 గంటల ప్రాంతంలో అనుమతి వచ్చింది. దీంతో ఏపీకి వెళ్లాలనుకున్న బాబుకు విమానాల రూపంలో మరో షాక్ తగిలింది. అసలే అనుమతి రాలేదని అసంతృప్తికి లోనైన చంద్రబాబు, టీడీపీ కార్యకర్తలు.. విమానాలు రద్దుకావడంతో మరింత తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ క్రమంలో అధికార వైసీపీపై పలువురు నేతలు దుమ్మెత్తి పోశారు.

వైసీపీ కుట్రలో భాగమే..

విశాఖపట్నం పర్యటనకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి, విమాన సర్వీసులను నిలిపేయడం వైసీపీ ప్రభుత్వ కుట్రగా టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఒక్కరోజే ఏపీకి విమాన సర్వీసులు బంద్ చేయడం వైసీపీ కుట్రలో భాగమేనన్నారు. ఒక్కరోజే విశాఖ, విజయవాడ ఎయిర్ పోర్టుల మూత వేయడం, మళ్లీ మంగళవారం సర్వీసులు ఉన్నాయని చెప్పడం దీనికి బలం చేకూరుస్తోందని అచ్చెన్న తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించాకే ఏపీకి విమాన సర్వీసుల బంద్ చేశారని.. కేంద్ర విమానయాన శాఖ మంత్రి ట్వీట్ దీనికి ప్రత్యక్ష రుజువన్నారు. ఏపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకే సర్వీసులు రద్దు చేశామని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారని.. అంతేకాదు 26 నుంచి ఏపీకి పరిమిత సర్వీసులని కేంద్రమంత్రి చెప్పారని అచ్చెన్న ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరి ఈ ఆరోపణలపై వైసీపీ నేతలు, మంత్రులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos