ఢిల్లీలో బాబును ‘ఫెవికాల్ బాబా’ అంటున్నారట!
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తహతహలాడుతున్నారు. అదేదో సామెత ఉందిగా.. ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా ఏపీలో ఎన్నికల ఫలితాల రాకముందే ఢిల్లీ వేదికగా చక్రాలు, బోల్ట్లు తిప్పుతున్నారని ఆయన అనుకూల మీడియా వాదరగొడుతున్న విషయం తెలిసిందే.
అయితే ఎన్నికల ఫలితాలు రాకముందే ఎందుకిలా ఎగిరెగిరి పడుతున్నారని సొంత పార్టీ నేతల నుంచే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయట. అయితే ఇదే అదనుగా భావించిన వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తెలుగు తమ్ముళ్లు నిలదీస్తారేమో!
"లగడపాటి ఎగ్జిట్ పోల్ సర్వేను నమ్మి ఎగ్జయిట్ అయిన తెలుగు తమ్ముళ్లు 23 తర్వాత తేడా వస్తే ఆయన్ను నిలదీసేట్టున్నారు. పార్టీ ఓడి, బెట్టింగుల్లో నష్టపోయినోళ్లు ఊరుకుంటారా? మాజీ ఎంపీవి కాబట్టి పోలీసు ప్రొటెక్షన్ అడగొచ్చు తప్పులేదు. బాబు, కిరసనాయిలు రేపటి నుంచి నీ ఫోన్లు కూడా ఎత్తరు"అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఈయనకంటే వాళ్లకు బాగా తెలుసు!
"పొరుగు రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వినాశనాన్ని కోరుకుంటుందని బోరున విలపించిన బాబు ఇప్పుడు చేస్తున్నదేమిటో? తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీని సోనియా, ఉత్తరాది నేతల పాదాల ముందు పడేశాడు. ఎప్పుడు కలవాలో ఎప్పుడు విడి పోవాలో ఈయనకంటే వాళ్లకు బాగా తెలుసు" అని ఎంపీ చెప్పుకొచ్చారు.
ఫెవికాల్ బాబా అని జోకేలు జోకులు!
"ఢిల్లీలో చంద్రబాబును అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫోటోలు దిగుతూ, వాళ్లను కలుపుతా వీళ్లను ఏకం చేస్తా అంటుంటే ఈ నిక్ నేమ్ తగిలించారట. ఎవరి టెన్షన్లలో వాళ్లుంటే సమయం, సందర్భం లేకుండా ఈ ఫెవికాల్ రాయబారాలేమిటని జోకులేసుకుంటున్నారట" అని రాజ్యసభ ఎంపీ సెటైర్ల వర్షం కురిపించారు.
చంద్రబాబు గ్రాఫ్ ఢమాల్!
"యూపీఏ, మాయా-అఖిలేశ్ ఫ్రంటులు చతికల పడ్డాయి. చంద్రబాబు గ్రాఫ్ ఢమాల్ అన్న విషయం కూడా వాళ్లకి అర్థమైంది. లగడపాటి సర్వేను అందరికీ చూపించబోగా విసుక్కున్నారట. పాపం అటు ఇటు కాకుండా పోయాడు బాబు. ఏడో దశ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉంటే చంద్రబాబు వెళ్లి మాయా, అఖిలేశ్, రాహుల్, పవార్లను ఫోటో సెషన్ల కోసం హింస పెడుతున్నాడట. సొంత రాష్ట్రంలో గెలిచే సీన్ లేక ఢిల్లీ, లక్నోలలో తిరుగుతున్నాడు. ఎన్డీఏ యేతర పార్టీలు అస్థిత్వ సమస్యను ఎదుర్కొంటుంటే ఐక్యత చర్చలంట" అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
రెడ్ హ్యాండెడ్గా..
"ప్రజలు ఓటుకు 2 వేలు డిమాండు చేస్తున్నారని చంద్రబాబు శోక సముద్రమయ్యాడు. అసలా సంస్కృతికి పితామహుడివే నువ్వు కదా బాబూ. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనే సంప్రదాయం మొదలు పెట్టిందెవరు? ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత కూడా నీతిమాలిన పనులకు తెగబడ్డావు" అని చంద్రబాబుపై విజయసాయి ఘాటు విమర్శలు గుప్పించారు.
అయితే.. ఎన్నికల సీజన్ మొదలుకుని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ఒక వైసీపీ కార్యకర్త కంటే దారుణంగా టీడీపీ, జనసేన పార్టీలను ఉద్ధేశించి వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.
అయితే అంతే రీతిలో అటు టీడీపీ, జనసేన నేతల నుంచి కౌంటర్లు సైతం విజయసాయికి వచ్చాయి. అయితే తాజా వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి. కాగా.. మే-23న ఫలితాలు విడుదల అనంతరం విజయసాయిరెడ్డి ఇలానే ట్వీట్స్ చేస్తారో లేకుంటే దుకాణం సర్దేస్తారో జస్ట్ వెయిట్ అండ్ సీ..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.