అందుకే మా ఎంపీలను బీజేపీ చేర్చుకుంది.. బాబు స్పందన!
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీకి టాటా చెప్పి బీజేపీ కండువాలు కప్పుకున్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో సుజనాచౌదరి, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేశ్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ చేరికలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలో విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో పార్టీ మారిన ఎంపీలు.. బీజేపీపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
అందుకే మా ఎంపీలను చేర్చుకుంది!
టీడీపీకి కార్యకర్తలు, ప్రజలే అండ నలుగురు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన నష్టం లేదు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రత్యేక హోదా కోసం బీజేపీతో టీడీపీ పోరాడింది. అది మనసులో పెట్టుకుని ఈ విధమైన దుశ్చర్యలకు బీజేపీ పాల్పడటం గర్హనీయం. పార్టీ మారుతున్నటువంటి నేతలు భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. ఒకరిద్దరు నేతలు స్వార్థం కోసం పార్టీ జెండాను వదిలేసినా.. భుజానికెత్తుకుని మోసే కార్యకర్తలు లక్షలాదిమంది ఉన్నారు" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం..!
"రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీలో చేరి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతాము. పార్టీ మారిన నేతలు చెప్పటం అవకాశవాదానికి నిదర్శనం. ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు వారాలు కాకముందే బీజేపీ మైండ్ గేమ్కు పాల్పడుతోంది. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు.. 37ఏళ్ల చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది, అనేక ఆటుపోట్లను అధిగమించింది. ప్రజలు, కార్యకర్తలు ముందుండి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నడిపి పార్టీకి అండగా నిలబడి కాపాడుకున్నారు" అని చంద్రబాబు తన ప్రకటనలో చెప్పుకొచ్చారు.
ఇది చరిత్ర చెప్పిన సత్యం..!
"అయితే ఇప్పుడు మళ్లీ టీడీపీని ఇబ్బంది పెట్టాలని చూసినా, చీలికలు తేవాలని ప్రయత్నించినా కార్యకర్తలు, ప్రజలే తెలుగుదేశం పార్టీకి కవచాలుగా మారి కాపాడుకుంటారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. సంక్షోభం ఎదురైనప్పుడల్లా తెలుగుదేశం పార్టీ మరింత బలపడింది.. నూతన జవసత్వాలు పొందింది. కార్యకర్తలు నిబ్బరంగా ఉండి, పార్టీపై జరుగుతున్న రాజకీయ దాడులను, భౌతిక దాడులను ధైర్యంగా ఎదుర్కోని నిలబడాలి" అని చంద్రబాబు ప్రకటనలో చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.