రంగనాయకమ్మపై సీఐడీ కేసు.. అసలేం జరిగింది!?

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ఏపీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకున్నదో.. నష్ట పరిహారం ఎన్నిరోజుల్లో ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ఘటన జరిగిన రోజే చనిపోయిన కుటుంబానికి కోటి రూపాయిలు, ఆ తర్వాత చికిత్స పొందుతున్న వారికి అలా నష్టపరిహారం ప్రకటించి.. వారం తిరగక ముందే వారికి అందేలా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. అయితే.. ఈ విషయంలో ఏపీ సర్కార్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విశాఖ జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు పూందోట రంగనాయకమ్మ రాసుకొచ్చారు. దీంతో ఆమెపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. కాగా 41-ఏ కింద సీఐడీ రంగానాయకమ్మకు నోటీసులిచ్చింది. ఇదే రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 15 లక్షలు జరిమానా విధించే అవకాశాలు మెండుగా వ్యక్తం చేస్తున్నారు.

ప్రశ్నిస్తే బెదిరిస్తారా!?

ఆమెపై కేసు నమోదు చేయడానికి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కూడా తీవ్రంగా తప్పుబడుతున్నారు. మరోవైపు వృద్ధురాలిపై కేసు నమోదు చేయడం పట్ల ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రంగనాయకమ్మను మాజీ మంత్రి, టీడీపీ నేత ఆలపాటి రాజా పరామర్శించారు. విశాఖ గ్యాస్ దుర్ఘటనపై రంగనాయకమ్మకు సీఐడీ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. ఒక సాదారణ మహిళా తన అభిప్రాయం చెబితే కేసులు పెడతారా..? ఎల్జీ ప్రమాద ఘటనపై ప్రశ్నిస్తే కేసులతో బెదిస్తారా..? వైసీపీ ప్రభుత్వంలో పౌరులకు భావవ్యక్తికరణ స్వేచ్చ లేదా..? అని ప్రభుత్వంపై ఆలపాటి ప్రశ్నల వర్షం కురిపించారు. పాలీమర్ ఘటనపై తప్పు కప్పిపుచ్చుకునేందుకే సాధారణ పౌరులపై కేసులు నమోదు చేస్తున్నారని.. ఇలాంటి చర్యలను ప్రజా స్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాలని ఆలపాటి రాజా వ్యాఖ్యానించారు.

నాకే ఆశ్చర్యమేసింది!

కాగా ఈ నోటీసులపై రంగనాయకమ్మ స్పందించారు. ‘విశాఖ ప్రమాదంపై నా అభిప్రాయాన్ని మాత్రమే షేర్ చేశాను. ప్రభుత్వాన్ని ఉద్దేశ్యపూర్వకంగా విమర్శించలేదు. సీఐడీ నోటీసులు ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయాను. అంతిమంగా విశాఖ బాధితులకు న్యాయం జరగాలన్నది నా ఆకాంక్ష’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా.. వృద్దురాలిపై సోషల్ పోస్టుల కేసు నమోదు చేయడంతో నగరవాసులు విస్మయానికి గురవుతున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో..? ఈ నేరం రుజువైతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.