నాకున్నది ఒక్క భార్యే.. కొందరేమో నాలుగో పెళ్లి కోసం తాపత్రయం!
- IndiaGlitz, [Monday,December 09 2019]
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’పై గత పదిరోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇటు జనాల్లోనే కాదు.. చట్ట సభల్లో సైతం దీనిపై చర్చలు జరుపుతున్నారు. సోమవారం నాడు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి మాట్లాడుతూ.. 26 ఏళ్ల దిశ.. టోల్ గేట్ వద్ద బైకు ఆపితే, ఆ బైకును పంక్చర్ చేసి, సాయం చేస్తున్నట్లు నటించి, అత్యాచారం చేసి కాల్చేశారని ఆయన ఒకింత భావేద్వేగానికి లోనయ్యారు. ఇటువంటి ఘటన జరిగినప్పుడు ఎలా స్పందించాలి? పోలీసులు ఎలా స్పందించాలి? రాజకీయ నాయకులు ఎలా స్పందించాలి? అన్న విషయం తనకూ తెలిసిందన్నారు. నిజంగా ఈ ఘటన చూశాకా చాలా బాధ అనిపించిందని.. ఇలాంటి ఘటన మన రాష్ట్రంలో జరిగితే ఎలా స్పందించాలి? అన్న ప్రశ్న తలెత్తిందని జగన్ చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూసిన తర్వాత నేరస్థులను కాల్చేసినా తప్పులేదు అనిపించదని జనగ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
పవన్పై మరోసారి పరోక్ష విమర్శలు!
‘నాకు కూడా ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.. చెల్లి ఉంది. భార్య ఉంది.. నాకున్నది ఒక్క భార్యే అధ్యక్షా. వారికి ఏమైనా జరిగితే నేను ఏ విధంగా స్పందిస్తాను అధ్యక్షా?. మన ఇళ్లల్లోని వారికి ఇటువంటి దారుణం జరిగితే ఎంతో తల్లడిల్లిపోతాం. నేరస్థులకు కఠిన శిక్షలు ఉండాలన్నారు. నాకున్నది ఒక్క భార్యే అధ్యక్షా..!. చిన్నపిల్లలపై జరిగిన నేరాలపై కూడా వేలాది కేసులు నమోదయ్యాయి. ఇంక కొందరు ఉన్నారు అధ్యక్షా.. పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొంత మంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ మధ్య కాలంలో అధ్యక్షా.. ఒకరు సరిపోరు.. ఇద్దరు సరిపోరు.. ముగ్గురు సరిపోరు.. నలుగురు పెళ్లాలు కావాలని తాపత్రయపడుతున్నారు. ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారిపై 2014, 2015, 2016, 2017, 2018ల్లో వందలాది కేసులు నమోదయ్యాయి అధ్యక్షా..’ అని స్పీకర్ తమ్మినేనితో జగన్ వివరించారు.
చంద్రబాబుపై విమర్శలు!
‘మా ప్రభుత్వం వచ్చి ఆరు నెలలే అయింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పరిపాలన కొనసాగింది. ఆయన కాలంలో మహిళలపై వేలాది నేరాల కేసులు నమోదయ్యాయి. మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, వరకట్నం కేసులు వంటివి ఎన్నో నమోదయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో నేరాల రేటు అధికంగా ఉంది’ అని టీడీపీ అధినేత చంద్రబాబు పైనా జగన్ విమర్శలు గుప్పించారు.