చంద్రబాబు పేరు చెబితే వంచనే గుర్తొస్తుంది.. సీఎం జగన్ విమర్శలు..

  • IndiaGlitz, [Thursday,March 14 2024]

ఒకరు చెబితే వంచన, మరొకరు పేరు చెబితే మ్యారేజ్ స్టార్ పేర్లు గుర్తుకొస్తాయని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఈబీసీ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొని మొత్తం 4,19,583 మంది ఖాతాల్లో రూ.629.37 కోట్లు బటన్ నొక్కి జమ చేశారు. అనంతరం మాట్లాడుతూ 2014లో మాదిరి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, బీజేపీ నేతలు మళ్లీ ప్రజల్ని మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. ఇలాంటి మోసగాళ్లు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

చంద్రబాబు పేరు చెబితే అక్కా చెల్లెమ్మలకు చేసిన వంచన గుర్తొస్తుంది. పొదుపు సంఘాల మహిళలకు ఆయన చేసిన దగా గుర్తొస్తుంది. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఒక్క మంచైనా చేశారా.?. పేదవారి ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా వేశారా.?. ఆయన పేరు చెబితే పేదలకు మంచి చేసిన ఒక్క పథకం అయినా గుర్తుకు వస్తుందా.? ఇక ఆయన దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించిన మోసగాడు గుర్తొస్తాడు. ఐదేళ్లకు ఓసారి కార్లను మార్చేసినట్లు భార్యలను మార్చే ఓ మ్యారేజ్ స్టార్ గుర్తొస్తాడు. ఒకరికి విశ్వసనీయత, మరొకరికి విలువలు లేవు. వీరంతా కూటమిగా ఏర్పడి మీ బిడ్డపై యుద్ధానికి వస్తున్నారు. పేదల భవిష్యత్తుపై యుద్ధానికి వస్తున్నారు' అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

రాష్ట్రంలో పేదల భవిష్యత్ మారాలన్నా.. అవ్వాతాతల పెన్షన్ ఇంటికి చేరాలన్నా.. పిల్లల చదువులు గొప్పగా సాగాలన్నా.. రైతన్నల ముఖంలో ఆనందం కలకాలం ఉండాలన్నా.. బటన్ నొక్కడం ద్వారా నేరుగా డబ్బులు ఖాతాల్లో పడాలన్నా..కేవలం మీ బిడ్డ పాలనలోనే జరుగుతాయని మర్చిపోవద్దు. రాబోయే ఎన్నికల్లో ఓటు బటన్ నొక్కేటప్పుడు పొరపాటు జరిగితే అన్నింటికీ తెర పడుతుంది. జగనన్న సీఎంగా ఉంటేనే మంచి జరుగుతుంది అని ప్రజలకు సూచించారు.

అలాగే కూటమిగా వస్తున్న నేతలు వచ్చే రోజులు ప్రతీ ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తామంటారని..వారి మాటలు విని మోసపోవొద్దన్నారు. పెత్తందార్లుకు, పేదలకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో మోసాలు చేసేవారికి ఓటు అనే దివ్యాస్త్రంతో బుద్ధి చెప్పండని సీఎం జగన్ పిలుపునిచ్చారు.