సింగిల్ హ్యాండ్‌తో చుక్కలు చూపించారు.. కానీ సీఎం సీట్ జస్ట్ మిస్..

ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. అయితే ఆర్‌జేడీ అధినేత, మహాకూటమి సారథి తేజస్వి యాదవ్‌ ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇచ్చారు. బిహార్‌లోని ఏ స్థానాన్ని కూడా ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో గెలిచింది దాదాపు లేదనే చెప్పాలి. దాదాపు 20 సీట్లలో కేవలం వంద లోపు మెజారీటీతోనే ఎన్డీఏ విజయాన్ని కైవసం చేసుకుంది. ఇక ఓట్ల పరంగా చూస్తే మరీ దారుణం. పాలక, విపక్ష కూటముల మధ్య ఓట్ల తేడా కేవలం 12,768 మాత్రమే కావడం గమనార్హం. మహాకూటమి కంటే కేవలం 0.3 ఓట్లు మాత్రమే ఎన్డీఏ ఎక్కువగా పొందింది. కేవలం 12,768 ఓట్లు సీఎం సీటును నిర్ధారించాయి.

2015 ఎన్నికల విషయానికి వస్తే.. మహాకూటమి కంటే ఎన్డీఏ 7.8 శాతం ఓట్లను అధికంగా సాధించింది. ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏకి 125 సీట్లు రాగా.. మహాకూటమి 110 స్థానాలు వచ్చాయి. ఈ సారి చెప్పాలంటే ఒక రకంగా ఎన్డీఏకి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టైంది. ఒంటి చేత్తో తేజస్వి మహాకూటమిని గెలుపు ముంగిటకు తీసుకెళ్లారు. ఎన్డీఏకి చుక్కలు చూపించారు. ఎన్నికల కమిషన్‌(ఈసీ) గణాంకాల ప్రకారం.. ఎన్‌డీఏకి 1,57,01,226 ఓట్లు (37.26) నమోదు కాగా.. మహాకూటమికి 1,56,88,548 ఓట్లు (37.23) వచ్చాయి. కేవలం 0.3 ఓట్లు తేడాతోనే తేజస్వి సీఎం కాలేకపోయారు.

కాగా.. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ ఆర్జేడీ నేతలు ఆరోపిస్తున్నారు. రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీలో మహాకూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అనంతరం తేజస్వి విలేకరులతో మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపులో చివరన ఉన్న నియోజకవర్గాలు సహా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అవకతవకలున్నాయన్నారు. కాబట్టి వాటిని రీకౌంటింగ్ చేయాలని ఈసీని కోరారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలపై ఈసీకి లేఖ రాస్తామని తేజస్వి వెల్లడించారు.