సీఎం జగన్ సీరియస్.. ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తారా!?
- IndiaGlitz, [Saturday,December 07 2019]
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో కలకలం రేగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో భూకంపం సృష్టిస్తున్నాయి. అది కాస్త పెను భూకంపంగా మారి చివరికి ఆయనపై వేటు వేసే పరిస్థితికి దాదాపుగా చేరిపోయింది!. అసలేం జరిగింది..? ఆనం ఏమన్నారు..? ఎవర్ని ఉద్దేశించి అన్నారు..? పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది..? సీఎం వైఎస్ జగన్ ఎలా రియాక్ట్ అయ్యారు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఆనం ఏమన్నారు..!?
నెల్లూరు జిల్లా వైసీపీలో విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సొంత పార్టీకే చెందిన కొందరిపై ఆనం పరోక్ష విమర్శలు గుప్పించారు. నెల్లూరు నగరంలో శాంతిభద్రతల సమస్య నెలకొందని.. వ్యవస్థలు తమ పని తాము చేసుకుని వెళ్లే పరిస్థితి జిల్లాలో లేని ఉన్నట్టుండి ఆయన బాంబే పేల్చారు. మాఫియా ముఠాల ఆగడాలపై ఎవరికి చెప్పుకోవాలో తెలియక జిల్లాకు చెందిన లక్షలాది మంది కుమిలిపోతున్నారని ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు బహిరంగంగా అనడం గమనార్హం. పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, అంత అనుభవం ఉన్న వ్యక్తే ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వైఎస్ జగన్ వార్నింగ్!
ఆనం వ్యాఖ్యలపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయనకు షోకాజ్ ఇవ్వాలని విజయసాయిని ఆదేశించినట్లు తెలిసింది. అయితే ఆయనిచ్చే షోకాజ్ నోటీసుకు వివరణ సంతృప్తిగా లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి ఏ మాత్రం వెనకాడొద్దని గట్టిగానే జగన్ తేల్చిచెప్పేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆనం, వైఎస్ జగన్ వ్యాఖ్యలతో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, నేతల్లో కలవరం మొదలైంది. మొత్తానికి చూస్తే.. ఆనం ఘటనతో వైసీపీ నేతలు చాలా వరకు అలెర్ట్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఆనం వ్యవహారం సస్పెన్షన్ వరకూ వెళ్తుందా లేకుంటే వివరణతోనే సరిపెట్టుకుట్టుందా..? అనేది తెలియాలంటే రామనారాయణ మీడియా ముందుకొచ్చే వరకూ వేచి చూడాల్సిందే.
విజయసాయి స్ట్రాంగ్ వార్నింగ్!
ఆనం వ్యాఖ్యలపై డైరెక్టుగా వైఎస్ జగన్ స్పందించకుండా.. పార్టీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా ఆనంకు సందేశం పంపారు!. వైఎస్ జగన్ మాట వినకుండా ఎవరైనా సరే మితిమీరి వ్యవహరించినా చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. గతంలో పార్టీ గీతదాటిన వారిపై చర్యలు తీసుకున్న సందర్భాన్ని కూడా విజయసాయి ఉదహరించారు. మరోవైపు మీడియా ముందు ఎలా పడితే అలా మాట్లాడటమేంటి..? అది కూడా ఆనం లాంటి సీనియర్ నేత మాట్లాడటమేంటి..? అని వైసీపీకి చెందిన కొందరు ముఖ్యలు సైతం ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి అనిల్ రియాక్షన్..!
‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీఎం పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన సాగుతోంది. మేం ఓకే చెబితే చాలా మంది టీడీపీ నేతలు
పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీని వీడబోతున్నారు. నెల్లూరు జిల్లా నుంచి త్వరలో మరిన్ని చేరికలు ఉన్నాయి. త్వరలో టీడీపీ భూస్థాపితం కానుంది. జగన్ సీఎం అయ్యాక ఎలాంటి మాఫియాకు అవకాశం లేదు. నెల్లూరులో ఆనం వ్యాఖ్యలపై ఆయన్నే వివరణ అడగాలి’ అని అనిల్ పరోక్షంగా ఒకింత కౌంటర్ ఇచ్చారు.