వరద బాధితులకు రూ.50 వేలు: కాంగ్రెస్ మేనిఫెస్టో

  • IndiaGlitz, [Tuesday,November 24 2020]

కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల చేశారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి‌, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క విడుదల చేశారు. వరద బాధితులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.2.5 లక్షల నుంచి 5 లక్షల వరకూ సాయం అందిస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది.

ఎంఎంటీఎస్‌, మెట్రోల్లో దివ్యాంగులు, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మెట్రో సేవలు పాతబస్తీ నుంచి ఎయిర్‌పోర్టు వరకు పొడిగిస్తామని తెలిపింది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని వెల్లడించింది. కార్పొరేట్‌ విద్యా సంస్థలల్లో ఫీజులను నియంత్రిస్తామని తెలిపింది. 100 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు విద్యుత్ రాయితీ కల్పిస్తామని హామీ ఇచ్చింది. అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి అందజేస్తామని తెలిపింది.

వరద రహిత హైదరాబాద్ కోసం జపాన్, జర్మనీ టెక్నాలజీని వినియోగిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ప్రకటించింది. 80 గజాలలోపు ఉన్న భూముల్లో ఇల్లు కట్టుకున్నవారికి ఆస్తి పన్ను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ లేకుండా చేస్తామని హామీ ఇచ్చింది. ధరణి పోర్టల్‌ను రద్దు చేయడమే కాకుండా.. ప్రతి కుటుంబానికి 30 వేల లీటర్ల ఉచిత మంచినీరు అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ప్రకటించింది.