స్మార్ట్ ఫోన్ నుంచి కూడా కరోనా సోకే అవకాశం ఉందట..

  • IndiaGlitz, [Tuesday,February 23 2021]

కాదేదీ కరోనాకు అనర్హం అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చింది.. ఇక పరిస్థితులన్నీ నార్మల్ అయిపోయాయి అనుకునేసరికి మళ్లీ ఈ మహమ్మారి పుంజుకుంది. ఈ నేపథ్యంలో పరిశోధకుల పరిశీలన మరింత ముందుకు సాగింది. నిత్య జీవితంలో స్మార్ట్‌ఫోన్ మనకు ఎంత దగ్గరయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది లేనిదే రోజు గడవడం సంగతి పక్కనబెడితే ఒక గంట గడవడం కూడా కష్టమే. అయితే ఈ స్మార్ట్ ఫోన్ నుంచి కూడా కరోనా సోకే అవకాశం చాలా ఎక్కువని తాజాగా పరిశోధనల్లో తేలింది.

కరోనా బారి నుంచి వచ్చే తుంపర్లు భిన్న వాతావరణ పరిస్థితుల్లో ఎంతసేపు ఉండిపోతాయనే అంశంపై ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు పరిశోధన చేశారు. ఈ క్రమంలోనే సాధారణ అద్దాలతో పోల్చితే స్మార్ట్ ఫోన్ తెరల మీద కోవిడ్ వైరస్ ఎక్కువ కాలం జీవించడానికి అవకాశముందని పరిశోధకులు గుర్తించారు. స్మార్ట్ ఫోన్‌ తెరలపై వైరస్ ఎక్కువ కాలం జీవించి ఉండటానికి కారణం.. స్క్రీన్‌కి కానీ.. స్క్రీన్‌గార్డులలో నీటిని పీల్చుకునే గుణం లేకపోవడమేనని పేర్కొన్నారు. కాబట్టి ఆ తుంపర్లు పడిన సమయంలో స్మార్ట్ ఫోన్ మనం వాడినట్టైతే కరోనా బారిన పడే అవకాశం చాలా ఎక్కువట.

అయితే తుంపర్లు ఎండిపోతే మాత్రం వైరస్ వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువని తేల్చారు. నీటి బిందువులతో పోల్చితే వ్యక్తి నోటి నుంచి వచ్చే తుంపర్లలో ఉప్పు, ప్రోటీన్(మ్యూకస్), కొంతమేర కలిసి ఉంటాయని తేల్చారు. దీనివల్ల తుంపర్లు ఆవిరవడానికి కానీ.. ఎండిపోయేందుకు కానీ ఎక్కువ సమయం తీసుకుంటుందని ఐఐటీ పరిశోధకులు వెల్లడించారు. అయితే ఎండిపోయిన తుంపర్లలోనూ కొన్నిసార్లు వైరస్ బతికే ఉంటుందని తేల్చారు. అయితే దీనికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు.