కరోనా ఎఫెక్ట్.. పొరుగు రాష్ట్రంలో అన్నీ బంద్

  • IndiaGlitz, [Monday,March 16 2020]

‘కరోనా’ నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాల కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, కేరళ, కర్ణాటక, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు థియేటర్స్ మొదలుకుని స్కూల్, కాలేజీల వరకూ అన్నీ బంద్ చేయగా.. తాజాగా ఇదే బాటలో తమిళనాడు సర్కార్ కూడా నడిచింది. ఈ నెల 31 వరకు విద్యా సంస్థలు బంద్ చేయాలని సీఎం పళనిస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. స్కూల్స్‌తో పాటు థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, జూపార్క్‌లు, క్లబ్బులు, బార్‌లు, రిసార్ట్స్ మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు తక్కువ మంది వెళ్లాలని సూచించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సీఎంవో నుంచి ఉన్నతాధికారులకు, జిల్లా అధికారులకు ఆదేశాలు పంపడం జరిగింది. ఈ ఆదేశాలు రేపట్నుంచి అమలు కానున్నాయ్.

కాగా.. ఇప్పటికే ఈ నెల 31 వరకు తెలంగాణలో విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు బంద్ కానున్నట్లు సీఎం ప్రకటించారు. వీటితో పాటు మాల్స్ కూడా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే.. సెలవుల నేపథ్యంలో టెన్త్ పరీక్షలపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండటంతో దీనిపై కూడా సీఎం క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు జరుగుతాయన్నారు. తాజాగా కేసీఆర్‌ బాటలోనే ఈ నెల 31 వరకు స్కూల్స్ బంద్ చేయాలని తమిళనాడు సర్కార్ నిర్ణయించింది.