close
Choose your channels

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గే అవకాశం..!

Tuesday, April 7, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గే అవకాశం..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19 నివారణా చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన ఈ సమీక్షకు సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై నిశితంగా చర్చించారు. ముఖ్యంగా కరోనా నివారణ చర్యలపై సుమారు రెండు గంటల పాటు చర్చ జరిగింది.


క్రమంగా కరోనా కేసులు తగ్గే అవకాశం

ఈ సందర్భంగా రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసులపై వివరాలను సీఎం జగన్‌కు అందజేశారు. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం వరకూ 150 కోవిడ్‌ నిర్దారణా పరీక్షలు నిర్వహించామని అధికారులు వివరించారు. నిన్నట్నుంచి ఒకే ఒక్క పాజిటివ్‌ కేసు వచ్చిందన్న విషయాన్ని జగన్ దృష్టికి అధికారులు వెల్లడించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారికి, వారి ప్రైమరీ కాంటాక్టులకు దాదాపు పరీక్షలు పూర్తయ్యాయని జగన్‌కు వెల్లడించారు. క్రమంగా కేసులు సంఖ్య తగ్గవచ్చని అధికారులు, నిపుణులు భావిస్తున్నారు. ఉదయం 9 గంటలవరకూ మొత్తం 304 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 997 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 196 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే వీరితో కాంటాక్ట్‌ అయిన వారు, కలిసి ప్రయాణించిన వారు, కనీసం 3–4 గంటలు వారితో ఉన్నవారిలో 2400 మందికి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో 84 మందికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారి ప్రైమరీ కాంటాక్టుల్లో 280 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. విదేశాలనుంచి వచ్చిన వారికి 205 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 11 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. విదేశాలనుంచి వచ్చిన వారితో కాంటాక్టు అయిన 120 మందికి పరీక్షలు వీరిలో 6 గురికి పాజిటివ్‌ వచ్చింది కరోనా లక్షణాలుగా భావించిన వారిలో 134 మందికి పరీక్షలు చేస్తే 7గురికి నెగెటివ్‌

హాట్‌స్పాట్లు, కుటుంబ సర్వే ద్వారా..

ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారు, వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌కు పరీక్షలు పూర్తయిన తర్వాత ఎవరెవరికి పరీక్షలు నిర్వహించాలన్న దాని పైనా సమావేశంలో చర్చించారు. కుటుంబ సర్వే ద్వారా జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి లాంటి ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్నవారిని గుర్తించి వారికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ర్యాండమ్‌ సర్వేపైన కూడా దృష్టిపెట్టాలని ఈ సందర్భంగా అధికారులకు జగన్ సూచించారు. వైజాగ్‌లో నిర్వహించిన పద్ధతిలో ర్యాండమ్‌ సర్వేలు జరగాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

వసతులు, సదుపాయాల మెరుగుపై దృష్టి..

క్వారంటైన్లు, క్యాంపుల్లో ఉన్న సదుపాయాలు, వసతులను పెంచడానికి ప్రధానంగా దృష్టిపెట్టాలని అధికారులను జగన్ ఆదేశించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ క్వారంటైన్లలో సుమారు 5300కు పైగా ప్రజలున్నారని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరాలు అందించారు. విదేశాలనుంచి వచ్చిన వారిలో ఇంకా హోం క్వారంటైన్‌లో ఉన్నవారు 19,247. వీరిని ప్రత్యేక యాప్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. వీరి ఐసోలేషన్‌ పీరియడ్‌ ముగిసిందని, ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్‌ కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. వీరే కాకుండా లక్ష మంది వరకూ హోం క్వారంటైన్‌లో వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు పర్యవేక్షణలో ఉన్నారు. సిబ్బంది ఎప్పటికప్పుడు వీరిని పర్యవేక్షిస్తున్నారని అధికారులు వెల్లడించారు.

కోవిడ్‌ ఆస్పత్రుల సన్నద్ధతపై దృష్టి..

క్రిటికల్‌ కేర్‌ కోసం నిర్దేశించిన కోవిడ్‌ ఆస్పత్రులు, అలాగే జిల్లాల వారీగా నిర్దేశించుకున్న కోవిడ్‌ ఆస్పత్రుల సన్నద్ధతపైనా దృష్టిపెట్టాలని అధికారులను జగన్ ఆదేశించారు. ఈ ఆస్పత్రుల్లో సదుపాయాల్లో నాణ్యత ఉండాలని జగన్ స్పష్టం చేశారు. రూపొందించుకున్న ఎస్‌ఓపీ ప్రకారం ప్రమాణాలు పాటించాలని సీఎం స్పష్టం చేశారు. వచ్చే సోమవారం నాటికి అనుకున్న ప్రమాణాల ప్రకారం వీటన్నింటిలోనూ వసతులు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. అలాగే క్వారంటైన్లు, క్యాంపుల్లో కూడా మరోసారి వసతులపై పరిశీలన చేసి, ఎక్కడైనా మెరుగుపరచాల్సిన అంశాలు ఉంటే.. వెంటనే దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.

వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్‌పై సమీక్ష..

ఇదిలా ఉంటే.. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయని, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని సీఎంకు అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ కనీసం 150 ట్రక్కుల వరకూ అరటిని ఎగుమతిచేస్తున్నామని, మరోవైపు మార్కెటింగ్‌శాఖ కూడా కొనుగోలుచేసి స్థానిక మార్కెట్లకు సరఫరా చేస్తోందని అధికారులు తెలిపారు. టమోటా క్రమంగా దిగుమతులు తగ్గుతున్నుందున మార్కెట్లోనే అమ్ముడుపోతోందని.. ఈ పంట విక్రయం విషయంలో సమస్యలు తొలగిపోయాయని అధికారులు వెల్లడించారు. బొప్పాయి, మామిడి పంట కొనుగోలుపైనా దృష్టిపెట్టామని అధికారులు వివరించారు. కర్నూలు వెలుపల ఉల్లిమార్కెట్‌ ఏర్పాటు చేసి.. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎంకు వివరించారు. ఆక్వా ఉత్పత్తుల్లో కూడా క్రమంగా ఎగుమతులు పెరిగాయని, కనీసం రోజుకు 40 కంటైనర్ల వరకూ ఎగుమతి అవుతోందని అధికారులు తెలిపారు. అలాగే ప్రాససింగ్, కోల్డు స్టోరీజీ ప్లాంట్లు కూడా దాదాపుగా తెరుచుకున్నాయని వెల్లడించారు. అక్కడక్కడా అకాల వర్షాలపై సీఎం ఆరాతీశారు. సంబంధిత రైతులను గుర్తించి వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.