close
Choose your channels

షాకింగ్.. కళ్ల నుంచి కరోనా..!

Monday, April 19, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ మహమ్మారి ఇంతలా విస్తరించడానికి పలు కారణాలను శాస్త్రవేత్తలు వెల్లడిస్తూ వస్తున్నారు. తాజాగా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఈ మహమ్మారి కళ్ల నుంచి కూడా వ్యాపించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పూర్తిగా కళ్లను కప్పి ఉంచే కళ్లజోళ్లను వినియోగించాలని సూచించారు. వైరస్ ప్రస్తుతం ఎక్కువగా రోగుల నుంచి వెలువడే సూక్ష్మ తుంపర్ల ద్వారా మాత్రమే ఇతరులకు వ్యాపించే అవకాశం చాలా ఎక్కువని శ్రీనాథ్‌రెడ్డి వెల్లడించారు. ఓ ప్రముఖ పత్రికకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మహమ్మారి సోకేందుకు కారణమైన పలు విషయాలను వెల్లడించారు.

నిర్లక్ష్యమే కారణం..

ఈ ఏడాది జనవరి నుంచి మనలో పెరిగిపోయిన నిర్లక్ష్యమే సెకండ్ వేవ్‌కి కారణమని శ్రీనాథ్‌రెడ్డి వెల్లడించారు. తొలిదశలో లాక్‌డౌన్, ప్రయాణ ఆంక్షలు పెంచడం వంటి కారణాలతో తొలిదశలో కేసుల సంఖ్య తగ్గిందన్నారు. కరోనాపై విజయం సాధించినట్టుగా మనం తొందరపాటుగా ప్రకటించుకోవడంతోనే ప్రజల్లో క్రమశిక్షణ మాయమై కరోనా విజృంభించడానికి కారణమైందని శ్రీనాథ్‌రెడ్డి వెల్లడించారు. ప్రజలు భారీగా పెద్ద సమూహంతో వేడుకలు, కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని అనుకున్నారని.. అలాగే ప్రభుత్వం సైతం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని భావించిందన్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలతో వైరస్‌లో కొత్త రకం దేశంలోకి ప్రవేశించిందన్నారు.

డిసెంబర్ వరకూ తెలియనివ్వలేదు..

కొత్తరకం వైరస్ గురించి సెప్టెంబర్‌లోనే తెలిసినప్పటికీ ప్రపంచానికి డిసెంబర్ వరకూ తెలియనివ్వకుండా యూకే జాప్యం చేసిందని శ్రీనాథ్‌రెడ్డి వెల్లడించారు. యూకే రకం కోవిడ్ వైరస్ సంక్రమణ వేగం 60 శాతం అధికంగా ఉందన్నారు. ఈ కొత్త రకం వైరస్ చాలా తేలిగ్గా మానవ శరీరంలోకి ప్రవేశించగలుగుతోందన్నారు. మాస్కు, శానిటైజర్, భౌతికదూరం, గుంపులకు దూరంగా ఉండటం ద్వారా వైరస్‌ను అడ్డుకోవచ్చని తెలిపారు. అయితే మనకు సంక్రమిస్తున్నది.. ఒరిజినల్ వైరస్సా.. లేదంటే యూకే వైరస్సా అనేది సెకండరీ అని.. ప్రస్తుతం కళ్ల నుంచి సైతం ప్రవేశించే అవకాశం ఉన్నందున ప్రజలు కళ్లజోళ్లు ధరించడం మంచిదని శ్రీనాథ్‌రెడ్డి వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.