close
Choose your channels

'రిటర్న్‌ గిఫ్ట్‌'కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. షాక్‌లో తెలుగు తమ్ముళ్లు!!

Tuesday, January 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు వేలు పెట్టి రెచ్చగొట్టారు.. రేపొద్దున మేం కూడా ఏపీ ఎన్నికల్లో కచ్చితంగా వేలుపెడతామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బాబుకు 'రిటర్న్ గిఫ్ట్' కచ్చితంగా ఇచ్చితీరుతామని గులాబీ బాస్ కేసీఆర్ ఇది వరకే కుండబద్దలు కొట్టి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీలో జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తుంటే ‘రిటర్న్ గిఫ్ట్’కు కౌంట్‌డౌన్ మొదలైందని తెలుస్తోంది. ఆ గిఫ్ట్ రాజకీయం మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రూపంలో ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.‌

సంక్రాంతి వేడుకలకుగాను తలసాని హైదరాబాద్‌ను వదిలి విజయవాడకు వెళ్లారు. అక్కడ సంబరాల్లో మునిగితేలుతున్న ఆయన యాదవ్ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడం.. ఏపీకి వచ్చి మరీ ఏపీ సీఎంపై ఘాటైన విమర్శలు చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఘాటు వ్యాఖ్యలు చేసింది తలసాని అయినా.. చేయించింది మాత్రం కేసీఆర్ అని ఇట్టే అర్థం చేస్కోవచ్చు. త్వరలోనే మరోసారి కోస్తా ఆంధ్ర పర్యటనకు వెళ్లాలని.. అవసరమైతే అక్కడే ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారట.

చిచ్చుపెట్టి.. రచ్చ రచ్చ ..!

అధికార పార్టీ అయిన టీడీపీలో ఎంత మంది యాదవ కులస్థులు ఉన్నారో.. వైసీపీలోనూ అంతమందే ఉన్నారు. అయితే సభలకు అని వచ్చిన తలసానిని యాదవ సంఘాలు, నేతలకు అవకాశం ఇవ్వలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మా కులాన్ని అడ్డుపెట్టుకుని వైసిపీ,టీడీపీ నాయకులు ఆయనను కలిశారని బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగని ఆయన అసలు తలసాని టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయవాడకు వచ్చారో... యాదవుల నాయకుడిగా వచ్చారో తేల్చుకోవాలని కూడా చెప్పారు. తలసాని రాక టీడీపీ-వైసీపీ యాదవుల మధ్య చిచ్చుపెట్టినట్లైంది. అయితే రేపొద్దున యాదవులు ఎటు ఉంటారో మరి.

ఇంతకు మునుపు వేరు.. ఇప్పుడు వేరు!

ఏపీకి తలసాని సంక్రాంతి సంబరాలకు వెళ్లడం ఈ ఏడాదేం కొత్తకాదు. నాడు టీడీపీలో ఉన్నప్పట్నుంచి ఆయన వెళ్తూ వస్తున్నారు. కాకపోతే ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఉన్నారు.. అంతేకాకుండా అధికార పార్టీ గనుక ఇంకాస్త ఆడంబరంగా వెళ్లారంతే. పైగా ఇలా ఏపీకెళ్లి పండగ చేస్కోవడం చంద్రబాబే నేర్పారట. పైగా అప్పట్లో చంద్రబాబుకు తలసాని అత్యంత సన్నిహితుడు కూడా. అయితే పార్టీ మారిన తర్వాత ఆ పరిస్థితుల్లేవ్.. పూర్తిగా బాబుకు బద్ధశత్రువుగా మారిపోయారు తలసాని. దీంతో ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్న తలసానికి ‘రిటర్న్ గిఫ్ట్’ అనే ఒక సువర్ణావకాశం రావడంతో దాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది.

తెలుగు తమ్ముళ్లు షాక్..

ఎప్పటిలాగా తలసాని తిన్నగా వచ్చి వేడుకలు చూసి.. నాలుగు ముద్దలు తిని వెళ్తారు కదా.. అంతకుమించి ఏముంటది..? అని తెలుగుతమ్ముళ్లు భావించారట. అయితే ఆయన వచ్చీరాగానే ఏకంగా యాదవ సభలు, సంఘాలు అని గందరగోళం రేపడంతో ఈయన రచ్చచేసేందుకు వచ్చాడంటూ ఇలా ఎందుకు చేస్తున్నడంటూ ఒకింత కంగుతిన్నారట. పైగా తెలంగాణలో రాజకీయంగా యాదవులు తిరుగులేని శక్తిగా మారారని.. ఏపీలో ఆశించినంతగా లేరని వారిలో చైతన్యం తెప్పించి యాదవులను ఎక్కడికో తీసుకెళ్లాలని తలసాని భావిస్తున్నారట. అందుకే తన ప్రత్యర్థి అయిన చంద్రబాబును కులంతో కొట్టాలన్నది బహుశా ఆయన టార్గెట్ ఏమో. మరీ ముఖ్యంగా సభావేదికగానే చంద్రబాబు హయాంలో యాదవులు అనగదొక్కబడ్డారని వ్యాఖ్యానించడంతో మనలో మనం కొట్టుకోవాల్సిన పరిస్థితులొచ్చాయే.. హతవిధీ అంటూ తలలు పట్టుకుంటున్నారట.

మొత్తానికి చూస్తే ఏపీ సీఎంకు గులాబీ బాస్ ఇస్తానన్న ‘రిటర్న్ గిఫ్ట్’ రాజకీయాలు షురూ అయ్యాయనే చెప్పుకోచ్చు. అయితే ఈ వ్యవహారం ఎవరికి లాభం చేకూరుతుంది..? ఎవరికి మైనస్‌‌ అవుతుంది..? అనేది ఆ పెరుమాళ్లకే ఎరుక. అయితే పండుగ ఫస్ట్ రోజే విజయవాడలో దుమారం రేపిన తలసాని.. ఇక మిగిలిన రెండ్రోజుల్లో ఇంకెంత రచ్చరేపుతారో అని యాదవ సంఘాల నాయకులు, టీడీపీ-వైసీపీ నేతలు గమనిస్తున్నారట. అయితే ఈ గిఫ్ట్ వ్యవహారం కొలక్కి రావాలన్నా.. దానిపై కాసింత క్లారిటీ రావాలన్నా కేసీఆర్ మరోసారి మీడియా ముందుకు రావాల్సిందేనేమో.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.