Kavitha: కవితకు వరుస ఎదురుదెబ్బలు.. సీబీఐ విచారణకు కోర్టు అనుమతి..

  • IndiaGlitz, [Friday,April 05 2024]

లిక్కర్ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా కవితను విచారిస్తామని సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపినన న్యాయస్థానం విచారణకు అనుమతి ఇచ్చింది. అయితే కొన్ని షరతులు విధించింది. ఆమెను ప్రశ్నించేందుకు ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రశ్నించే సమయంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని కవిత స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డ్ చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాలతో త్వరలోనే అధికారులు కవితను విచారించనున్నారు.

గతంలో కవితను విచారించిన సమయంలో నమోదు చేసిన స్టేట్‌మెంట్, అప్రూవర్లు, ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. ముఖ్యంగా భూముల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ కవితను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. దీంతో కవిత నుంచి మరింత సమాచారం రాబట్టిన తర్వాత మరో ఛార్జీషీటు దాఖలు చేసే అవకాశముంది. ఢిల్లీ మద్యం కేసులో ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించగా.. ఈడీ తరపున జోసెఫ్ హుస్సేన్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సోమవారం ఉదయానికి రిజర్వ్ చేసింది. అలాగే సాధారణ బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్ 20న విచారణ చేపడతామని పేర్కొంది.

కాగా మార్చి 15న లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉండగా తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి మారారు. ఇందులో భాగంగా తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. లిక్కర్ స్కాంలో కవితదే కీలక పాత్ర అని రూ.100కోట్లు చేతులు మారాయని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా అరెస్టై తిహార్ జైలులోనే ఉంటున్నారు.